బాబుకు సినిమా క‌నిపిస్తోందట‌

Update: 2016-09-05 07:37 GMT
ఒక‌టి వెంట మ‌రొక‌టి..ఒక‌దాని త‌ర్వాత ఇంకొక‌టి ఇలా వరుస ఉద్యమాలతో ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరవుతోంది. కాపులకు రిజ‌ర్వేష‌న్ అంశం ర‌గులుతోంది, ప్రత్యేక హోదా డిమాండ్ సెగ ఇప్పటికే ఢిల్లీకి తాకగా - ఆ అంశం టీడీపీ-బీజేపీ బంధానికి ప్రమాదకరంగా పరిణమించింది. గత మూడు నెలల నుంచి రాయలసీమలో ఉక్కు ప్యాక్టరీ కోసం జనం రోడ్డెక్కారు. విశాఖలో రైల్వే జోన్ పెట్టాలన్న డిమాండ్‌ తో ఉత్తరాంధ్ర ఉడుకుతోంది. మొత్తంగా ఏపీలో ఇటు అభివృద్ధితో స‌మాంత‌రంగా నిర‌స‌న‌లు ర‌గులుతున్నాయ‌నే టాక్ న‌డుస్తోంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ ఏపీలో ఒక సెంటిమెంటుగా మారింది. కేంద్రం మాత్రం హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని ఇప్పటికే రాష్ట్రానికి సంకేతాలు పంపింది. బాబు మౌనం - నిస్సహాయత వల్లే హోదా రావడం లేదని విపక్షాలు విమర్శిస్తుండగా - హోదా ఇవ్వకపోతే విడాకులు తప్పవని, స్నేహపూర్వకంగానే విడిపోదామని బాబు కేంద్రానికి స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు రాయలసీమలో కూడా ఉక్కు ఉద్యమం ఉద్ధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాలన్న డిమాండ్ పట్టణాలకు విస్తరిస్తోంది. ఇటీవల ఇదే డిమాండ్‌ తో ప్రొద్దుటూరు జనం మొత్తం రోడ్డుమీదకొచ్చారు. తాజాగా అఖిలపక్షం నిర్వహించి ‘కడప ఉక్కు-జనం హక్కు’ అని నినదించింది. ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు అన్ని విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రాయలసీమ సెంటిమెంటు - కడప ఆత్మగౌరవ సమస్యగా మార్చే ఎత్తుగడతో వైసీపీ వెళుతోంది.

కోస్తాలో కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ ఇప్పటికే ప్రభుత్వానికి సంకటంలా పరిణమించింది. బాబు ఎన్నికల హామీ నెరవేర్చాలని కోరుతూ ముద్రగడ కొత్త ఎత్తుగడతో వెళుతున్నారు. దాసరి, చిరంజీవి మధ్య ఆయన సయోధ్య కుదిర్చి, వారిని సింహభాగాన ఉంచి, తాను బాబుపై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్ర కూడా రైల్వే జోన్‌ పై నిరసన స్వరం వినిపిస్తోంది. నవంబర్ - డిసెంబర్‌ లో విశాఖ కార్పొరేషన్‌ కు ఎన్నికలు జరగనున్నాయి. అప్పటిలోగా జోన్ ప్రకటించకపోతే, టీడీపీ- బీజేపీ కూటమికి చేదు ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. తాజాగా మాజీ మంత్రి కొణతల రామకృష్ణ రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభుకు ఘాటు లేఖ రాశారు. కాగా, రైల్వే జోన్ ఉద్యమం విద్యార్థుల చేతుల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వే జోన్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఎన్నికయిన ఆ శాఖ మంత్రి సురేష్‌ ప్రభు విమర్శల పాలవుతున్నారు. సురేష్ ప్రభు రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నికయి నేటికి సరిగ్గా మూడునెలలయింది. ఆయన అన్ని అంశాల గురించి మాట్లాడుతున్నారు గానీ, విశాఖ రైల్వే జోన్ గురించి మాత్రం ప్రస్తావించకపోవడం ఉత్తరాంధ్ర వాసులకు ఆగ్రహం కలిగిస్తోందంటున్నారు. మొత్తంగా ఏపీలో ర‌గులుతున్న ఆందోళ‌న‌లు ఏపీ సీఎం చంద్ర‌బాబుకు సినిమా చూపించ‌డమ‌నే రీతిలో ఉన్నాయ‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News