ప్రత్యేక హోదాలో టీడీపీ-బీజీపీ అడ్డంగా బుక్కయ్యాయే

Update: 2017-08-20 11:18 GMT
- ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చకపోవడం వల్లే సమస్య తలెత్తింది. అయినా కొండ ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక హోదా కల్పించాలని 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకే రాష్ట్రానికి అంతకు మించిన ప్యాకేజీని అందజేసేందుకు కేంద్రం మొగ్గు చూపింది.

- దేశంలో 11 ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదా కలిగివున్నా అవి సాధించిన అభివృద్ధి నామ మాత్రమే. త్వ‌ర‌లో అది కూడా ముగిసిపోతుంది. కాబ‌ట్టి ఏపీ త‌ర‌ఫున ఒత్తిడి చేయ‌ట్లేదు. గ‌డువు ముగిసిన త‌ర్వాత ఆయా రాష్ర్టాల్లో ఉన్న కంపెనీల‌కు ద‌క్కే ప్ర‌యోజ‌నాలు ఏవీ లేవు. అదే స‌మయంలో ఏపీ ఒక్క‌టే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిల‌వ‌డం ఖాయం.

- కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉండ‌టం వ‌ల్ల ఏపీకి ఎన్నో లాభాలు. అందుకే మేం ప్ర‌త్యేక హోదా కోసం ఒత్తిడి చేయ‌డం లేదు. అయినా హోదా ఏం సంజీవ‌ని కాదు..

ఇవి తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు - ఆయ‌న పార్టీ నేత‌లు చెప్పిన మాట‌లు! ప్ర‌త్యేక హోదాను లౌక్యంగా ప‌క్క‌న పెట్టేందుకు ప్ర‌స్తావించిన ఉదాహ‌ర‌ణ‌లు!! వీటన్నింటిలో అతి ముఖ్య‌మైన‌ది...ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ర్టాల‌కు త్వ‌ర‌లో ఆ గ‌డువు ముగిసిపోతుందని చెప్ప‌డం. అయితే అదేం జ‌ర‌గ‌లేదు. హిమాచల్‌ ప్రదేశ్ - ఉత్తరాఖండ్ - జమ్మూకశ్మీర్‌ లతో పాటుగా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కింద లభించే పన్ను రాయితీలను కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో పదేళ్ల పాటు పొడిగిస్తూ గ‌త వారంలో జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకుంది. సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ దీనికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అంటే ఇన్నాళ్లు టీడీపీ నేత‌లు చెప్పినదంతా త‌మ ప్ర‌య‌త్న‌లోపాన్ని - కేంద్రాన్ని నిగ్గ‌దీసి అడ‌గ‌లేని ప‌రిస్థితికి స్థితికి నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు అంటున్నారు. తాజా నిర్ణ‌యంతో ఈశాన్య రాష్ట్రాల్లో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న 4284 కంపెనీల‌కు మేలు క‌ల‌గ‌నుంది.  జీఎస్‌ టీ అమల్లోకి వచ్చిన జూలై ఒకటో తేదీ నుంచి 2027 మార్చి 31వ తేదీ వరకు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఈ రాయితీలు అమల్లో ఉంటాయని ఇందుకోసం రూ. 27,413 కోట్లను కేటాయించడానికి కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింద‌ని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ వెల్ల‌డించారు. సెంట్రల్‌ ఎక్సైజ్‌ చట్టం రద్దు కావడంతో ఈ నిబంధనల కింద ఇచ్చే రాయితీలు జీఎస్‌ టీ రాకతో రద్దయిపోయాయి. దీంతో పన్ను రాయితీలను పదేళ్ల పాటు రిఫండ్‌ రూపంలో చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఏపీలో మ‌రోమారు ప్ర‌త్యేక హోదా అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌త్యేక హోదా కోసం నిల‌దీసిన ప్ర‌స్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ - ఉప రాష్ట్రప‌తి  వెంక‌య్య నాయుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ విష‌యాన్ని అట‌క ఎక్కించిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా క‌ల్పించనున్న‌ట్లు బీజేపీ ప్ర‌చార సార‌థి హోదాలో ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల హామీలు గుప్పించారు. కానీ ఎన్నిక‌ల్లో నెగ్గిన త‌ర్వాత ఆ విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేశారు. నీతి అయోగ్ సిఫార్సులంటూ, ఇప్ప‌టికే ఉన్న రాష్ర్టాల‌కు గడువు ముగిసిపోతుంద‌ని పేర్కొంటూ, అంత‌కంటే ఎక్కువ‌గా ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తున్నామంటూ దాట‌వేశారు. అయితే ప్ర‌త్యేక హోదాపై ప్ర‌తిప‌క్షాలు - విద్యార్థి సంఘాలు ప‌ట్టుబ‌ట్టాయి. ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక హోదా డిమాండ్ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు - నిర‌స‌న‌లు చేప‌ట్టింది. కాంగ్రెస్‌ - వామ‌ప‌క్షాలు స‌హా ఉద్య‌మించారు. 2016లో తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో మరణించిన తర్వాత జల్లికట్టు ఆట పునరుద్ధరణ కోసం చెన్నైలోని మెరీనా బీచ్ సాక్షిగా ఆందోళన సాగించి విజయం సాధించిన త‌మిళుల స్పూర్తిలో ఏపీ యువ‌త సైతం విశాఖ‌లోని రామ‌కృష్ణ బీచ్ వ‌ద్ద గ‌ళం విప్పాయి. ఆర్కే బీచ్ ఆందోళ‌న‌నను అయితే ఉక్కుపాదంతో అణిచివేసింది. అయితే ఏపీ ప్ర‌భుత్వం లాబీయింగ్ ద్వారానే ప్ర‌యోజ‌నాలు అంటూ చెప్పుకొచ్చింది. టీడీపీ నేత‌లు ప్రత్యేక హోదాను లైట్ తీసుకున్న నేప‌థ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఈ డిమాండ్‌ ను నీరుగార్చ‌డం మొద‌లు పెట్టింద‌నే భావ‌న ఉంది. తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యంతో ఈ రెండు పార్టీల తీరు తేట‌తెల్లం అయింద‌ని పేర్కొంటూ ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం ఇప్పుడు ఉద్య‌మిస్తే కేంద్రం దిగివ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అంటున్నారు.  
 
కొస‌మెరుపుః ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అని అధికార తెలుగుదేశం నేతలు చేసిన ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని ఆ పార్టీ నేతలు ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో క్యూ కట్టిన వైనాలు వెలుగులోకి వ‌చ్చిన స‌మ‌యంలో తేట‌తెల్లం అయింది. ఉత్తరాఖండ్‌ ఏర్పడ్డాక కేంద్రంలోని అప్పటి వాజపేయి సర్కారు ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించింది. హోదా వల్ల లభించే లాభాలను మూటగట్టుకునేందుకు ఏపీ నుంచి ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారిలో టీడీపీ చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి ముందు వరుసలో ఉన్నారు. హోదా దండగ మారిందని తరచూ చెప్పిన సుజ‌నాచౌద‌రి ఉత్తరాఖండ్‌ లో పరిశ్రమలు పెడితే మంచి లాభాలున్నాయని స్వయంగా తాను ఆ రాష్ట్రంలో స్థాపించిన పరిశ్రమ వార్షిక నివేదికలో వెల్లడించిన విషయం రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. ఇంకా టీడీపీకి చెందిన ఎంపీలు సీఎం రమేష్‌ - గల్లా జయదేవ్‌ - రాయపాటి సాంబశివరావు - జెసి దివాకర్‌ రెడ్డి - గుంటూరు జిల్లా వినుకొండ శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు - రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు కావూరి సాంబశివరావు తదితరులు ఇక్కడి నుంచి అక్కడికెళ్లి పెట్టుబడులు పెట్టినట్లు ప‌లు ప్ర‌చార సాధ‌నాల్లో జోరుగా క‌థ‌నాలు వ‌చ్చాయి.
Tags:    

Similar News