మిథాలీకి బీఎండబ్ల్యూ ఇస్తున్నారు.. ఎవరంటే?

Update: 2017-07-25 07:18 GMT
మహిళల ప్రపంచకప్‌ లో ఫైనల్ చేరినందుకు భారత జట్టులోని ప్రతి ఒక్కరికీ రూ.50 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది బీసీసీఐ. ఇది గొప్ప నిర్ణయమంటూ అందరూ భారత బోర్డుపై ప్రశంసలు కురిపించారు. మహిళల జట్టు బీసీసీఐ గొడుకు కిందే ఉంది కాబట్టి వాళ్లకు బోర్డు నజరానా ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే అమ్మాయిల ఆటతో ఏ సంబంధం లేని ఓ వ్యక్తి.. భారత కెప్టెన్ అయిన మిథాలీ రాజ్ కు బీఎండబ్ల్యూ కారు ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు చాముండీశ్వరీనాథ్. తన స్ఫూర్తిమంతమైన నాయకత్వంతో జట్టును ముందుండి నడిపిస్తూ ప్రపంచకప్ ఫైనల్ చేర్చినందుకు గాను మిథాలీకి రూ.40 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును చాముండీశ్వరీనాథ్ బహుమతిగా అందజేయబోతుండటం విశేషం.

సచిన్ టెండూల్కర్ కే కాదు.. చాలా మంది సెలబ్రెటీలకు  అత్యంత సన్నిహితుడైన చాముండీశ్వరినాథ్ హైదరాబాద్ బిగ్ షాట్లలో ఒకడు. ఈయనకు పబ్లిసిటీ యావ బాగా ఎక్కువ. వార్తల్లో నిలిచేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. ఏ ప్లేయర్ అయినా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటితే వెంటనే ఇలా నజరానాలు ప్రకటిస్తుంటారు. రియో ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన పి.వి.సింధు.. సాక్షి మాలిక్.. జిమ్నాస్టిక్స్ లో సాహసోపేత ప్రద్శన చేసిన దీపా మాలిక్ లకు కూడా బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చాడు చాముండి. ఇంకా చాలామంది క్రీడాకారులకు ఆయన కార్లు.. ఇతర బహుమతులు ఇచ్చాడు. ఇప్పుడు హైదరాబాదీ అమ్మాయైన మిథాలీకి కూడా కారు బహుమతిగా ప్రకటించాడు. పబ్లిసిటీకి చేసినా.. ఎందుకోసం చేసినా క్రీడాకారులకైతే మంచి ప్రోత్సాహమే అందుతోంది.
Tags:    

Similar News