అజ్ఞాతం వీడిన రాసలీలల సీడీ కేసు యువతి .. ఆ తర్వాత ఏమైంది ?

Update: 2021-03-31 07:30 GMT
కర్ణాటక రాజకీయాల్లో కలకలం సృష్టించిన రాసలీలల సీడీ కేసులోని యువతి ఎట్టకేలకు అజ్ఞాతం వీడి ఎం బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. దరిదాపుగా 28 రోజులపాటు అజ్ఞాతంలోనే ఉన్న ఆ యువతి నిన్న నాటకీయ పరిణామాల మధ్య బెంగళూరులోని ఏసీఎంఎం కోర్టులో  హాజరైంది. న్యాయమూర్తి బాలగోపాల్ కృష్ణ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధిత యువతి కోర్టులో హాజరు కాబోతోందన్న సమాచారంతో మీడియా ప్రతినిధులు కోర్టు బయట ఎదురు చూశారు. దీనితో అక్కడ  పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కోర్టుకు చేరుకున్న యువతి  దాదాపు రెండు గంటలపాటు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఆ సమయంలో అక్కడ ఓ స్టెనోగ్రాఫర్ మాత్రమే ఉండగా, ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు.

ఆ తర్వాత   కోర్టు అనుమతితో ఆమెను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు రాత్రి వరకు విచారించారు. అనంతరం ఈ రోజు  కూడా విచారణకు రావాలని ఆదేశించారు. బాధిత యువతికి సిట్‌ పై నమ్మకం లేదని, అలాగే , ఆమెకు ప్రాణభయం ఉందని, ఈ నేపథ్యంలో కోర్టు ఎదుటే వాంగ్మూలం ఇచ్చేలా అనుమతివ్వాలని కోర్టుకు విన్నవించగా జడ్జి బాలగోపాల్‌ కృష్ణ ఆమోదంతో కోర్టులో  న్యాయమూర్తి ఎదుట యువతి హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చింది.  తాము ఇచ్చిన మాట ప్రకారం బాధిత యువతిని కోర్టు ఎదుటకు తీసుకొచ్చాము. ఇక పోలీసులు వారి పనిని చేయాలి. నిందితుడు స్వేచ్ఛగా బయటకు తిరగకుండా అరెస్టు చేయాలి అని బాధిత యువతి న్యాయవాది జగదీశ్‌ డిమాండ్‌ చేశారు. యువతి ఎలాంటి భయం లేకుండా జరిగినది మొత్తం న్యాయమూర్తి ఎదుట వెళ్లడించిందని తెలిపారు.

కోర్టు లో జడ్జి ముందు బాధిత యువతి పలు ఆసక్తికర  విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. నన్ను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదు. రమేశ్‌ బలమైన నాయకుడు కావడంతో నాకు ప్రాణ భయం ఉంది. నన్ను ఆయన బెదిరించడంతో భయపడి దాక్కున్నాను. నా తల్లిదండ్రులు, సోదరుడిని కూడా రమేశ్‌ ఒత్తిడి చేస్తున్నారు. నా కుటుబానికి రక్షణ కల్పించాలి’ అని యువతి కోరినట్లు ప్రసారమాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అలాగే తనకు రమేశ్‌ ఇచ్చిన బహుమతులు, ఆయనతో తీసుకున్న ఫోటోలు, చేసిన చాటింగ్, వీడియో, మొబైల్‌ సందేశాల తదితర సాక్ష్యాలను సిట్‌కు అందించిందని తెలుస్తుంది.
Tags:    

Similar News