సంక్రాంతి వేళ.. ఏపీలో బీఆర్‌ఎస్‌ హడావుడి మామూలుగా లేదుగా!

Update: 2023-01-15 23:30 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పండుగ సమయం. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం గత రెండు రోజులుగా సంక్రాంతి పండుగ సందడితో కళకళలాడుతోంది.

ఓవైపు కోడి పందేలు, ఇళ్ల ముంగిట రంగవల్లులు, ప్రతి ఇంటా పిండివంటలు, కొత్త బట్టలు, పట్టు పరికిణీలు ధరించిన అందాల బొమ్మలు, చేతికి అందివచ్చిన పంట, ఎక్కడెక్కడి నుంచో ఇళ్లకు చేరుకుంటున్న జనం, బంధుమిత్రుల రాకపోకలతో ఏపీలో ప్రతి గ్రామం కళకళలాడుతోంది.

అయితే ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. కానీ ఈసారి, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో పండుగ రూపానికి గులాబీ రంగు జత చేరింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఆంధ్రాలోని గ్రామీణ ప్రాంతాల్లోకి అడుగుపెట్టి, పండుగకు కొత్త రూపాన్ని ఇచ్చింది.

ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కేసీఆర్‌ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, విజయవాడ వంటి పలు జిల్లాల్లో కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ గులాబీ జెండాలు, పోస్టర్లు, హోర్డింగ్‌లు, బోర్డులు ఏర్పాటు చేశారు.

యానాం, అవిడిరేవు, కొత్తపేట, కడియం, కాకినాడ, ముమ్మిడివరం, ముక్కామల వంటి మారుమూల గ్రామాల్లో సైతం రోడ్లు, రహదారుల వెంబడి బీఆర్‌ఎస్, కేసీఆర్‌ హోర్డింగ్‌లు, పోస్టర్లు దర్శనమిచ్చాయి.

ఇటీవల బీఆర్‌ఎస్‌ లో మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల్‌ కిశోర్‌ బాబు, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి చింతల పార్థసారధి తదితరులు కేసీఆర్‌ సమక్షంలో చేరిన సంగతి తెలిసిందే. తోట చంద్రశేఖర్‌ ను ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ నియమించారు.

అయితే బీఆర్‌ఎస్‌ ఇంకా ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరించకముందే, పార్టీ ఇంకా ఆంధ్రాలో తన జిల్లా యూనిట్లను ఏర్పాటు చేయనప్పటికీ కొందరు బీఆర్‌ఎస్, కేసీఆర్‌ పట్ల తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ కు అనుకూలంగా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు.
Tags:    

Similar News