వైసీపీ కార్యకర్తపై బాంబు దాడి

Update: 2021-01-25 04:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో మరో కలకలం చోటుచేసుకుంది. ఏకంగా వైసీపీ కార్యకర్తపై బాంబు దాడి జరగడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డట్టు బాధిత వైసీపీ కార్యకర్త కుటుంబం ఆరోపిస్తోంది.

చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో వైసీపీ కార్యకర్త మల్లికార్జున పై ఆదివారం రాత్రి టీడీపీ నేతలు హత్యాయత్నానికి యత్నించినట్టు పోలీసులు పేర్కొంటున్నారు.   మరికుంటపల్లి వద్ద వ్యక్తిగత పని నిమిత్తం వెళ్లిన మల్లికార్జునపై బాంబులతో దాడికి దిగినట్టు చెబుతున్నారు. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకోగా మల్లికార్జున భార్య నాగవేణికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానికుల సహాయంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

టీడీపీకి చెందిన నాగరాజు, రెడ్డయ్య , ఈశ్వరయ్యలు తనను చంపడానికి ప్రయత్నించారని బాధితుడు ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకు పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.

కాగా ఘటనకు సంబంధించి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య పాత కక్షలనే కారణమని నియోజకవర్గంలో అనుకుంటున్నారు. ఆ క్రమంలోనే వైసీపీ నేతపై టీడీపీ నేతలు దాడి చేసినట్టుగా చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News