పబ్లిసిటీ కోసం బాబు ఉట్టి కూడా కొడతారట

Update: 2016-08-24 10:24 GMT
 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు విపరీతమైన ప్రచార పిచ్చి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన పాలనలో ప్రచారం - హుంగుఆర్భాటాలు తప్ప ఏమీ లేదని తేల్చేశారు. ప్రతి విషయాన్నీ ప్రచారం కోసం వాడుకోవడం చంద్రబాబుకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదన్నారు. పుష్కరాలు మొదలుకుని సింధు విజయం వరకూ ప్రతి అంశాన్ని తన సొంత డబ్బా కోసం వాడుకుంటున్నారని భూమన మండిపడ్డారు. జనాల్లో పబ్లిసిటీ వస్తుంది సార్ అని ఎవరైనా చెబితే చంద్రబాబు కృష్ణాష్టమిలో ఉట్టికొట్టడానికి కూడా వస్తారని ఆయన అన్నారు.

 చంద్రబాబు పాలన రాష్ట్రానికి ఒక రాచపుండులా మారిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో గోదావరి జిల్లాలకు కూడా నీరు అందని పరిస్థితి ఏర్పడిందని... ఇంతకుముందెన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆయన అన్నారు. అనంతపురం - చిత్తూరు - కర్నూలు జిల్లాల్లో వేరుశెనగ రైతుల పంట ఎండి అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా సంబరాలుచేసుకుంటున్నారని మండిపడ్డారు. 12 రోజుల పాటు పాలనను గాలికి వదిలేసి పుష్కరాలతో గడిపేసిన చంద్రబాబు ఇప్పటికైనా మారాలని... అసెంబ్లీని ఐదు రోజులే సమావేశపరుస్తామని చంద్రబాబు చెప్పడం ప్రజాసమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని చెప్పడానికి నిదర్శనమని భూమన అన్నారు.

పుష్కరాలకు హాజరైన పెద్దలందరినీ అసెంబ్లీ సమావేశాలు చూడ్డానికి కూడా పిలవాలని... అప్పుడే  చంద్రబాబు అసెంబ్లీలో వ్యవహరించే తీరు అందరికీ తెలుస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబు వల్ల ఏపీ మేడిపండులా మారిపోయిందని... ఆయన చెబుతున్నట్లుగా అది అందంగా కనిపిస్తున్నా పొట్ట విప్పితే పురుగులే అన్నట్లుగా పరోక్షంగా ఆరోపణలు చేశారు. తన మార్కెటింగ్‌ ప్రతిభతో ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే.. టీడీపీ నేతలు మాత్రం భూమన వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు. కృష్ణాష్టమికి ఉట్టి కొట్టడం ఏమైనా నేరమా అని వారు ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News