భీమవరం ఎమ్మెల్యే ఒక ఆకు రౌడీ.. పవన్ సీరియస్ వార్నింగ్

Update: 2021-02-27 05:22 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కోపం వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి ఆయన వ్యక్తిగతంగా తీవ్ర వ్యాఖ్యలు చేయటమే కాదు.. సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వీరవాసం మండలం మత్స్యపురిలో సర్పంచిగా ఎన్నికైన మహిళ జనసేనకు మద్దతుదారు కావటం.. దీన్ని జీర్ణించుకోలేక స్థానిక ఎమ్మెల్యే ఇళ్లపై దాడులు చేయించి.. కార్లు.. టూవీలర్లను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది.

దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తీవ్రంగా స్పందించారు. వైసీపీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే ఒక ఆకు రౌడీ అని.. సహకార బ్యాంకును దోచేసిన వ్యక్తిగా పేర్కొన్నారు. చిరు వ్యాపారులు.. ఉపాధ్యాయులు.. మధ్యతరగతి ప్రజల కష్టార్జితాన్ని బ్యాంకులోదాచి పెట్టుకుంటే వాటిని మింగేసిన వ్యక్తిగా ఆరోపించారు. ఆయనకు ఎలా సమాధానం చెప్పాలో తమకు బాగా తెలుసని పవన్ ఫైర్ అయ్యారు.

బెదిరింపులకు గురి చేయటం.. దుర్భాషలాడటం.. సభ్య సమాజం తలదించుకునేలా పరుష పదజాలం వాడటం.. వ్యక్తిగతంగా నన్ను దూషించటం అతనికి అలవాటుగా మారిందన్నారు. పంచాయితీ ఎన్నికల్లో జనసేన విజయాన్ని చూసి ఓర్వలేక అధికారపక్ష నేతలు అనేక నియోజకవర్గాల్లో దాడికి పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మత్స్యపురిలో సర్పంచ్ గా ఎన్నికైన ఎస్సీ మహిళ కారేపల్లి శాంతిప్రియ.. ఇతర వార్డు సభ్యుల ఇళ్లపై దాడులు చేశారన్నారు. సర్పంచ్ గా ఎన్నికైన శాంతిప్రియ అంబేడ్కర్ విగ్రహానికి దండ వేస్తుంటే.. ఆమెపై దాడికి పాల్పడినట్లుగా చెప్పారు.

ఈ సందర్భంగా ఏపీ డీజీపీకి సూటిగా ఒక విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు పవన్ కల్యాణ్. గతంలో ఒకసారి భీమవరంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని.. మళ్లీ ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే స్థానిక ఎమ్మెల్యే ఆగడాల్ని అరికట్టాలన్నారు. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే సంయమనం తమకు లేదన్న పవన్.. తర్వాత తమను ఏమీ  అనొద్దని చెప్పారు. ‘డీజీపీ సవాంగ్ కు ముందే చెబుతున్నాం. తర్వాత ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు’ అని తేల్చేశారు.

భీమవరం ఎమ్మెల్యే నోటి నుంచి వస్తున్న మాటలన్ని భయంతో వచ్చినవేనని చెప్పారు. తమ వాళ్లు తప్పులు చేస్తే సరిదిద్దుకుంటామన్న పవన్.. దాడులు చేసి ఇళ్లపైకి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోమన్నారు. కొన్నిపిచ్చి కుక్కలు కరుస్తాయని.. అంత మాత్రానా పిచ్చి కుక్కను కరవం కదా అన్న పవన్..

‘మున్సిపాలిటీ వ్యాన్ వచ్చే వరకు వెయిట్ చేసి.. దాన్ని అందులో పడేస్తాం. మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది. పిచ్చి కుక్కును పట్టుకెళ్లిపోతుంది. అప్పటివరకు దయజేసి సంయమనం పాటించండి’ అని కార్యకర్తలకు సూచన చేశారు. ఏమైనా.. భీమవరం ఎమ్మెల్యేకు నేరుగా పవన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది.
Tags:    

Similar News