బండి సంజయ్ అరెస్ట్.. సిద్ధిపేటలో టెన్షన్ టెన్షన్

Update: 2020-10-27 04:15 GMT
దుబ్బాక ఉప ఎన్నికలు టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ మధ్య నువ్వా నేనా అన్న రేంజ్​లో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోటాపోటీగా ర్యాలీలు, ప్రతి ర్యాలీలు, సవాళ్లతో దుబ్బాక అట్టుడుకుతోంది. కాగా సోమవారం దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్​ రావు బంధువుల ఇళ్లలో పోలీసులు ఏకకాలంలో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు రఘునందన్​రావు అనుచరులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రఘునందన్​ రావు  మామ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. సిద్ధిపేటలో రఘునందన్  మామ ఇంట్లో రూ.18.67 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.  సిద్దిపేటలో బీజేపీ కార్యకర్తలు పోలీసుల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పోలీసులు లాఠీ చార్జీ చేశారు.

విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సిద్దిపేటకు బయల్దేరారు. దాడి జరిగిన కుటుంబసభ్యులను  కలవడానికి సిద్దిపేటకు బయలుదేరిన బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు ఆయనను గట్టిగా వ్యాన్‌లోకి నెట్టడంతో గాయాలు అయినట్టు సమాచారం. దీంతో ఆయన గట్టిగా అరుపులు కూడా పెట్టారు. సంజయ్ ని సిద్దిపేట నుంచి కరీంనగర్ తీసుకెళ్లారు.

టీఆర్​ఎస్​ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని సంజయ్​ ఆరోపించారు. ఆయన కరీంనగర్​లోని తన ఇంట్లో దీక్ష చేస్తున్నారు.

దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో సోదాలు చేయడం ఏమిటని సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు టీఆర్​ఎస్​ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  మరోవైపు సిద్దిపేటలో వందలమంది టీఆర్ఎస్​ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేసినట్టు సమాచారం.
Tags:    

Similar News