బాబు గురించి జైట్లీ నోట్ చేసుకున్నారా?

Update: 2016-04-28 04:30 GMT
‘‘సేవ్ ద డెమొక్రసీ’’ పేరుతో దేశ రాజధానిలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమం జోరందుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ గురించి జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయటంతో పాటు.. రెండేళ్ల పాటు సాగుతున్న బాబు సర్కారు ఎంత అవినీతిమయం అన్న విషయాన్ని చాటి చెప్పేలా జగన్ ఢిల్లీ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పేరిట చంద్రబాబు సర్కారు అవినీతిని అచ్చేసిన జగన్.. ఢిల్లీలో తాను కలిసిన రాజకీయ నేతలకు ప్రత్యేకంగా అందిస్తున్నారు. బాబు సర్కారు అవినీతిని.. తాను ఆరోపించినట్లుగా రెండేళ్ల వ్యవధిలో బాబు చేసిన రూ.1.34లక్షల కోట్ల అవినీతి గురించి జగన్ నాన్ స్టాప్ గా వివరిస్తున్నారు. బుధవారం పలువురు నేతల్ని కలవటం తెలిసిందే. బాబు సర్కారు అవినీతిని హైలెట్ చేయటం..  అవినీతి సొమ్ముతో విపక్ష ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయటం లాంటివి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న జగన్.. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసిన సందర్భంగా ఆసక్తికర ఉదంతం ఒకటి చోటు చేసుకుందని చెబుతున్నారు. అరుణ్ జైట్లీని కలిసి.. బాబు సర్కారు మీద తాము అచ్చేసిన పుస్తకాన్ని ఇచ్చి.. ఆ పుస్తకం గురించి జగన్ వివరించినప్పుడు.. అరుణ్ జైట్లీ అందులోని ముఖ్యాంశాల గురించి తనకు చెప్పాలంటూ జగన్ ను అడిగారట.

ఈ సందర్భంగా చంద్రబాబు సర్కారు చేసిన కుంభకోణాల గురించి ఆర్థికమంత్రి జైట్లీకి విపక్ష నేత జగన్ వివరించారట. జగన్ చెప్పిన విషయాల్ని జైట్లీ శ్రద్ధగా వినటంతో పాటు.. కొన్ని అంశాల్ని ప్రత్యేకంగా నోట్ చేసుకున్నట్లుగా జగన్ పార్టీ నేతలు ప్రచారం చేయటం గమనార్హం.
Tags:    

Similar News