ఏపీలో 'లోకల్‌ వేడి' - సీఎస్ లేఖ

Update: 2020-03-16 04:59 GMT
ఆంధ్రప్రదేశ్‌లో లోకల్‌బాడీ ఎలక్షన్ల వాయిదా వేడి ఇప్పట్లో చల్లారేలా లేదు. ఆ సీరియల్‌ కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి. చేతిలోకొచ్చిన ఏకగ్రీవాలు జారిపోకుండా, పరిస్థితి ప్రత్యర్థికి అనుకూలంగా మారకముందే... ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని జగన్‌ సర్కారు గట్టి పట్టుదలతో ఉంది. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు ఎన్నికల సంఘం ఆదివారం వాయిదా వేసింది. ఆ నిర్ణయంపై జగన్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవరో రిపోర్టు ఇస్తే, ఇంకెవరో నిర్ణయం తీసుకోవడమేంటి... సీఎం నేనా, రమేశ్‌ కుమారా అంటూ ఫైరయ్యారు. ఓటమి భయంతో చంద్రబాబు సామాజికవర్గమే ఎలక్షన్లు వాయిదా వేయించిందంటూ వైసీపీ నాయకులు ఒంటికాలిపై లేచారు. ఏకంగా గవర్నర్‌కూ కంప్లైంట్‌ చేశారు. రమేశ్‌ కుమార్‌ కూడా తక్కువ తినలేదు. తానా నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ గవర్నర్‌ను కలిసి వివరించనున్నారు. ఎన్నికలు వాయిదా వేయడానికి కారణాలు, తనకు అందిన రిపోర్టులు, ఏపీలో ఉన్న సిట్యుఏషన్‌పై గవర్నర్‌కు వివరించనున్నారు.

తాజాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ కు.. గవర్నమెంట్‌ చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికలు వాయిదా నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, ముందుగా అనుకున్న డేట్లలోనే ఎలక్షన్లు జరిపించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కంగారు పెట్టేంతగా వ్యాపించలేదని, సిట్యుయేషన్‌ అండల్‌ కంట్రోల్‌ అని ఆమె తన లెటర్‌లో వివరించారు. ఎన్నికల వాయిదా వ్యవహారంపై గవర్నర్‌ ఏ నిర్ణయం తీసుకోకపోతే, సుప్రీంకోర్టుకు వెళతామని ఇప్పటికే వైసీపీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో, గవర్నర్‌ ఎవరి వైపు మొగ్గుతారు..? పెద్దాయన నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.
Tags:    

Similar News