లోకేశ్ పై సీబీ ‘ఐ’..ఈ టీడీపీ మాజీ నేత జగన్ ను కోరతారట!

Update: 2019-07-19 16:43 GMT
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో టీడీపీలో నైరాశ్యం నెలకొంది. అసలు పార్టీ ఓటమికి కారణం ఏమిటంటూ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దీర్గాలు తీస్తుంటే... అసలు కారణం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజకీయాల్లో ఓనమాలు కూడా నేర్చుకోకుండానే పార్టీలో నెంబర్ టూగా ఎదిగిన లోకేశ్ అతి తెలివి కారణంగానే పార్టీ ఓడిపోయిందన్నది ఆ పార్టీ శ్రేణుల వాదన. ఇదే వాదనతో ఏకంగా పార్టీకి, పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేసి బీజేపీలో చేరిపోయిన అన్నం సతీష్ ప్రభాకర్... ఇప్పుడు లోకేశ్ నే టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐటీ శాఖ మంత్రిగా లోకేశ్ భారీ అవినీతికి పాల్పడ్డారని, దానిపై సీబీఐ చేత విచారణకు డిమాండ్ చేసిన సతీష్... అందుకోసం తాను ఏకంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కలిసి విన్నవించనున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సతీష్ మరిన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. పార్టీ ఘోర పరాజయానికి లోకేశే కారణమని చెప్పిన సతీష్... చంద్రబాబును నిండా ముంచేసింది కూడా లోకేశేనని కుండబద్దలు కొట్టారు. లోకేశ్ మంత్రిగా ఉన్న సమయంలో ఐటీ శాఖలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించిన సతీష్... దానిపై సీబీఐ విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

లోకేశ్ పై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరనున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో లోకేశ్ పై సీబీఐ విచారణకు సిఫారసు చేయాలని తాను ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కోరతానని, ఈ మేరకు తాను రెండు, మూడు రోజుల్లోనే జగన్ ను కలుస్తానని సతీష్ చెప్పుకొచ్చారు. చూస్తుంటే... లోకేశ్ చుట్టూ ఉచ్చు బిగియడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆ ఉచ్చు కూడా తనకు అత్యంత సన్నిహితంగానే కాకుండా పార్టీకి వీర విధేయుడిగా ముద్ర పడిన అన్నం సతీష్ ప్రభాకర్ రూపంలో పొంచి ఉండటం గమనార్హం.
Tags:    

Similar News