ఏపీ పాలిటిక్సులో 3జీ పొలిటీషియన్స్ ఎంట్రీ

Update: 2017-02-22 11:09 GMT
రాజకీయరంగం వారసత్వాలకు వేదికవుతోంది. ఇది కొత్తేమీ కాకపోయినా ప్రస్తుతం ఏపీలో మూడో తరం వారసులు దూసుకొచ్చేస్తున్నారు. తండ్రులు - తాతల వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో మొత్తం వ్యవహారాలు చూస్తున్నది కొందరైతే.. ఇంకా పైస్థాయిలో రాజకీయ నేపథ్యం ఉన్న వారసులు ఏకంగా ప్రభుత్వాలనే నడిపిస్తున్నారు. మొత్తానికి ఏపీలో మూడో తరం పొలిటికల్ వారసులు మాత్రం వచ్చే ఎన్నికల నాటికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
    
ఈ థర్డ్ జనరేషన్(3జీ) పొలిటీషియన్లలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది లోకేశ్ నే. తాత ఎన్టీఆర్.. తండ్రి చంద్రబాబు.. మామ బాలయ్య.. ఇలా అన్ని వైపుల నుంచి వారసత్వంతో ఇప్పటికే కీలకంగా మారిన ఆయన త్వరలో మంత్రి పదవినీ చేపట్టబోతున్నారు. మరోవైపు స్పీకర్ కోడెల తనయుడు శివరామ్ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆయన అన్ని ఏర్పాట్లు చేసకుంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీకి ఇప్పుడు అంతా ఆయనే అన్నట్లుగా ఉందట.
    
మరోవైపు జేసీ బ్రదర్స్ ఫ్యామిలీ నుంచి దివాకరరెడ్డి కుమారుడు పవన్ రెడ్డి - ప్రభాకరరెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిలు కూడా ఎన్నికల గోదాలో దిగేందుకు రెడీ అవుతున్నారు. అనంతపురంలోనే పరిటాల రవి తనయుడు శ్రీరాం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం గ్యారంటీ అని తెలుస్తోంది.
    
నెల్లూరులో ఆనం వివేకా కుమారుడు కూడా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ టిక్కెట్టు సాధించాలని పెద్ద ప్రయత్నమే చేస్తున్నారట. విజయవాడలో దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ తో పాటు పలువురు ఇతర నేతల కుటుంబాల నుంచి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి వారసులు సిద్ధమవుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News