రైతుల కోసం ఏపీ క్రేజీ నిర్ణ‌యం

Update: 2016-08-07 06:41 GMT
చైనాలో ఇటీవ‌లే ఓ క్రేజీ ఆఫ‌ర్ వ‌చ్చింది. అదేంటంటే...భారీ సంపత్తి - జనాభా - యుద్ధపరికరాలతో చైనా అందరినీ భయపెడుతుంటే - చైనాను ఎలుకలు వణికిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌కు పెట్టింది పేర‌యిన ఆ దేశంలో ఎలుక‌ల వ‌ల్ల కోట్లాది రూపాయ‌ల న‌ష్టం జ‌రుగుతోంది. దీంతో దిద్దుబాటుకు దిగిన చైనా ప్రభుత్వం - ఒక ఎలుకను చంపి తీసుకువచ్చిన వారికి నగదు బహుమతి ప్రకటించింది. ఆ పథకం ఇప్పటికీ అమల్లో ఉంది. మ‌రోవైపు ఢిల్లీలో పార్లమెంటుకు కోతుల బెడద ఎక్కువ. పార్లమెంటుకే కాదు. డిల్లీలో చాలాచోట్ల కోతుల బెడద తప్పించుకునేందుకు జీతగాళ్లను నియమించుకుంటున్నారు. ఇప్పుడు నవ్యాంధ్రలో అదే త‌ర‌హా ప్ర‌య‌త్నం సాగుతోంది. ఏకంగా రూ.63 ల‌క్ష‌లు కేటాయించింది.

రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని రైతులను ఎలుకలు హడలెత్తిస్తున్నాయి. అందుకే చంద్రబాబు ప్రభుత్వం - దానిపై శాస్త్రీయ పరిశోధనలు చేసి - ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేస్తున్న రైతుల దిగుబడిని హరిస్తున్న ఎలుకలపై దృష్టిసారించి, వారి దిగులు తీర్చే పనిలో పడింది. గుంటూరు - కృష్ణా - నెల్లూరు - పశ్చిమ - తూర్పు గోదావరి జిల్లాలు వరిపంటకు పెట్టింది పేరు. ఎండాకాలంలో పప్పు ధాన్యాలకూ ఈ జిల్లాలు ప్రసిద్ధి. దానితోపాటు ఎలుకలు - చీడ - పీడకూ ఈ జిల్లాలు ప్రసిద్ధమైనవే. తడిసిన ధాన్యంతో ఎలుకలు పెరిగి - రైతుల దిగుబడిని దెబ్బతీస్తున్నాయని, వీటిని నాశనం చేస్తే తప్ప, వాతావరణ సమతుల్యం కాపాడలేమని ప్రభుత్వం శాస్త్రీయ‌ పద్ధతుల్లో నిర్వహించిన సర్వేలో తేల్చింది.ఈ జిల్లాల్లో హెక్టారుకు 5-8 క్వింటాళ్ల వరిని ఎలుకలు నాశనం చేస్తున్నాయని తెలుసుకున్న ప్రభుత్వం - 50,40,000 వేల క్వింటాళ్ల వరికి రక్షణ కల్పించాలని నిర్ణయించింది. దాంతో వ్యవసాయ శాఖ గ్రామాల్లో పంటల రక్షణపై ప్రచారం ప్రారంభించింది.

ఎలుకలను చంపే రసాయనాల కోసం ప్రభుత్వం ఆర్కేవీవై స్కీం కింద కోటి 63లక్షల రూపాయలు కేటాయించింది.ఈ నిధులతో ఆయా గ్రామాల్లోని స్థలాల్లో విషపు ఎరలు ఉంచుతున్నారు. వాటి రవాణా ఖర్చులను రైతులే భరిస్తుండగా, వాటిని కొని, వాడే ఖర్చును గ్రామ పంచాయితీ భరిస్తోంది. దీనిపై గ్రామ రైతులను చైతన్యపరిచేందుకు స్థానికంగా ఉన్న సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మండలాల్లో హెక్టారుకు 8-10 గ్రాముల బ్రోమోడియోలోన్ రసాయనాన్ని 0.25 శాతం సీబీని రైతులకు 100 శాతం సబ్సిడీతో ప్రభుత్వమే ఇస్తోంది. వాటిని నూకలు - వెజిటబుల్ ఆయిల్ వంటి ఎరలతో కలిపి పంటనష్టం కలిగిస్తున్న ఎలుకలు ఉండే ప్రాంతంలో ఉంచుతున్నారు. నూకలు - వెజిటబుల్ ఆయిల్‌ ను రైతులే భరిస్తున్నారు. ఒకే రోజు దీన్ని అమలు చేయటం వల్ల పంటలు నాశనం చేసే ఎలుకలు పెద్ద సంఖ్యలో చనిపోతున్నట్లు వ్యవసాయ శాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. దీనికోసం ఏర్పాటుచేసిన ల్యాబ్‌లలో ఆధునిక పరికరాల కోసం 82 లక్షలు అందిస్తోంది. ఏపిలో నమూనాల విశే్లషణకు ఐదు క్రిమిసంహారక పరీక్ష ల్యాబ్‌లు ఏర్పాటుచేశారు. ఎలుకలపై యుద్ధం చేయడం ద్వారా, రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కాపాడటంతోపాటు, రైతు ఆర్థికంగా నష్టపోకుండా చేయూతనివ్వడమే అసలు లక్ష్యమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News