ఏపీ బీజేపీ.. చూపంతా జనసేన వైపే

Update: 2019-01-12 08:01 GMT
టీడీపీతో కలిసి ఉన్నన్ని రోజులు ఏపీలో బీజేపీ పరిస్థితి బాగానే నడిచింది. ఎప్పుడైతే తెగతెంపులు జరిగాయో అప్పుడు అసలు కథ మొదలైంది. రాష్ట్రంలో బీజేపీని ఎంత బద్నామ్ చేయాలో అంతా చేశారు చంద్రబాబు. తన అను'కుల' మీడియా సహకారంతో ఉన్నవి లేనివి సృష్టించి బీజేపీని దాదాపు జీరో చేసేశారు. ఈ నేపథ్యంలో కమలంతో కొనసాగేందుకు బీజేపీ బడా నేతలెవరూ ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వారందరికీ ఇప్పుడు రారమ్మని స్వాగతం పలుకుతోంది జనసేన.

ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు కామినేని శ్రీనివాస్ ఎప్పట్నుంచో బీజేపీలో స్తబ్దుగా ఉంటున్నారు. పార్టీ మీటింగ్స్ - కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పైగా ఈయన పవన్ మనిషి. గత ఎన్నికల్లో పవన్ రికమండేషన్ తోనే ఈయనకు సీట్ వచ్చిందని చాలామంది చెప్పుకుంటారు. సో.. మంచి టైమ్ చూసి ఈయన కచ్చితంగా జనసేనలోనే చేరుతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇప్పుడు దీనికి మరింత ఊతమిస్తూ మరో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విష్ణుకుమార్ - ఏపీలో బీజేపీకి సీన్ లేదని తేల్చిచెప్పేశారు. రాబోయే ఎన్నికల్లో తను విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని అప్పుడే చెప్పలేనంటున్నారు. ఈయన కూడా జనసేన వైపే చూస్తున్నారు.

ఇక ఏపీకి సంబంధించి మిగిలింది ఇద్దరే. వాళ్లలో ఒకరు మాణిక్యాలరావు - మరొకరు ఆకుల సత్యనారాయణ. వీళ్లలో ఆకుల సత్యనారాయణ ఇప్పటికే బీజేపీని ఓ రేంజ్ తో తిట్టిపోస్తున్నారు. రేపోమాపో వెళ్లి జనసేనలో చేరుతానని పరోక్షంగా సంకేతాలిచ్చారు. అటు మాణిక్యాలరావు మాత్రం ప్రస్తుతానికి బీజేకీకే జై కొడుతున్నారు. ఎన్నికల వేడి ఊపందుకునే కొద్దీ అతడిలో కూడా మార్పు వస్తుందేమో చూడాలి.



Full View

Tags:    

Similar News