చంక దిగగానే శత్రువైపోయాడు..

Update: 2018-03-19 14:57 GMT
నాలుగేళ్ల కిందట తెలుగుదేశం పార్టీ ఎన్నికల కష్టాల్లో ఉన్నప్పుడు చేయందించి ఒడ్డున పడేశాడాయన.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలొస్తున్నాయి.. ఎవరికో చేయందించడం ఎందుకని అనుకుంటూ ఈసారి తెలుగుదేశం పార్టీకి చేయిచ్చేశాడాయన. ఇలాంటి షాక్‌ను ఊహించని టీడీపీ ఇప్పుడు అరిచి గగ్గోలు పెడుతోంది. మంచి సమయం చూసి తమకు చేయిచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడుతోంది.  ఇంతకాలం పవన్‌ను పల్లెత్తి మాటనని పార్టీ ఇప్పుడు తమకు దూరమవడంతో అన్ని రకాల విమర్శలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఏపీ టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ ను విమర్శించడంలో కత్తి మహేశ్ ను మించిపోతున్నారు.
    
అయితే... సొంతంగా ఎన్నికల బరిలో దిగడానికి రెడీ అవుతున్న పవన్‌ తమను వదిలేయడాన్ని టీడీపీ ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. తాము వదిలేసిన బీజేపీ ఇప్పుడు తమను దెబ్బ తీసేందుకు పవన్‌ను తమ నుంచి దూరం చేసిందని టీడీపీ అనుమానిస్తోంది. ఆ క్రమంలోనే... తమపై బీజేపీ చేస్తున్న కుట్రలో పవన్ భాగస్వామి అని.. పవన్ ను అడ్డంపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపిస్తోంది.
    
కానీ... తాము బీజేపీని వదిలేయడానికి కారణాలు చెబుతున్నట్లే పవన్ కూడా తమను వదిలేస్తూ చెబుతున్న కారణాలను మాత్రం పెడచెవిన పెడుతోంది. పవన్ ఆరోపణలకు సమాదానం చెప్పడం లేదు సరికదా తిరిగి పవన్‌పై దిగజారుడు ఆరోపణలు చేస్తోంది. అసలు పవన్ లాంటి వాళ్ల అవసరం రాష్ట్రానికిలేదంటూ ఏపీకి ఎవరు అవసరమో ఎవరు అవసరం లేదో తామే డిసైడ్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 ఒకప్పుడు జగన్‌పై విమర్శలు చేయడానికి పోటీపడి చంద్రబాబు మెప్పు పొందడానికి టీడీపీ నేతలు తెగ ప్రయత్నించేవారు. తాజాగా పవన్‌తో సంబంధాలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఏపీ మంత్రులు, ఇతర నేతలు పోటాపోటీగా పవన్‌పై విమర్శలు కురిపిస్తున్నాయి. తాజాగా...మంత్రి అమరనాథ్ రెడ్డి అయితే పవన్ వంటి నాయకులు రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు. ఇతర నేతలూ అదే దారిలో సాగుతున్నారు. దీంతో... ఏరు దాటేవరకు ఓడ మల్లన్న .. ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామతను టీడీపీ గుర్తుకు తెస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News