శంకుస్థాపన శుభలేఖ తెలుగులో లేదా?

Update: 2015-10-13 04:41 GMT
అంగరంగ వైభవంగా నిర్వహించ తలపెట్టిన ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. పూర్తి తెలుగుదనంతో నిర్మించాలని భావిస్తున్న అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమ ఆహ్వాన పత్రాన్ని ఇప్పటివరకూ తెలుగులో ప్రింట్ చేయలేదన్న వార్తలు వస్తున్నాయి. విస్మయాన్ని రేకెత్తించే ఈ వార్తకు ఏపీ సర్కారు వివరణ ఇవ్వాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శంకుస్థాపనకు సంబంధించి ఇప్పటివరకూ శుభలేఖల్ని ఇంగ్లిషులో మాత్రమే ప్రింట్ చేశారని.. తెలుగులో ముద్రించలేదన్న మాట వినిపిస్తోంది. వేర్వేరు రాష్ట్రాలు.. ఇతర దేశాల ప్రతినిదులకు పంపే శుభలేఖలు ఇంగ్లిషులో ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చని.. కాకుంటే.. తెలుగు శుభలేఖలు ఇప్పటివరకూ ప్రింట్ కాలేదంటూ తెలుగు భాషాభిమానులు కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు.

ఇప్పటివరకూ పంపిణీ చేసిన ఆహ్వాన పత్రాలు తెలుగులో లేకపోవటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ప్రస్తుతం తెరపైకి వచ్చినట్లుగా తెలుగులో కానీ ఆహ్వానపత్రాల్ని ముద్రించకుంటే అంతకు మించిన దారుణమైన అంశం మరొకటి లేదని తెలుగు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని వెంటనే తెలుగులో ప్రింట్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అంశాల మీద ఏపీ సర్కారు వివరణ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News