లంచగొండుల భరతం పడుతున్న ఏసీబీ.. '14400' కి 45 వేల కాల్స్ !

Update: 2020-09-07 07:10 GMT
లంచం .. దేశంలో ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్న అతి పెద్ద మహమ్మారి. చిన్న పని నుండి పెద్ద పని వరకు ప్రభుత్వ ఆఫీసుల్లో పని జరగాలంటే లంచం ఇవ్వాల్సిందే. అసలు కొన్ని చోట్ల ప్రభుత్వ అధికారులని కలవాలన్న కూడా లంచం ఇవ్వాల్సిందే. ఈ లంచాలు ఇవ్వలేక , ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగలేక కొంతమంది ఆత్మహత్యకి పాల్పడుతుంటారు. ఈ తరహా ఘటనలు చాలా జరిగాయి. అయితే , ఈ పరిస్థితులు మళ్లీ కనిపించకూడదు అని , లంచం అన్న మాట కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో వినిపించకూడదు అని  సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ఆదేశాలతో అవినీతి నిరోధక విభాగం లంచ గొండుల పై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దాడులకు శ్రీకారం చుట్టింది.

అలాగే , అవినీతి నిరోధానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘14400’ కాల్‌ సెంటర్లకు పెద్దఎత్తున కాల్స్‌ వస్తుండడంతో  వాటిపై  ఏసీబీ వేగంగా స్పందిస్తోంది. ఇప్పటికే ఈ కాల్‌సెంటర్‌ పై ప్రజల్లో అవగాహన బాగా పెరిగినప్పటికీ సీఎం ఆదేశాల మేరకు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. అలాగే, లంచగొండులపై నిఘాను ముమ్మరం చేసింది. గత ఏడాది నవంబర్‌లో ‘14400’ కాల్‌ సెంటర్‌ ను ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఈ కాల్‌ సెంటర్‌ కు 44,999 కాల్స్‌ రాగా ఇందులో అవినీతికి సంబంధించిన కాల్స్‌ 1,747 ఉన్నాయి. ఇందులో 1,712 ఫిర్యాదులను పరిష్కరించారు. మరో 161 కాల్స్‌ పై చర్యలు తీసుకుంటున్నారు. ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 13 ట్రాప్‌ కేసులను కూడా ఏసీబీ నమోదు చేసింది. మూడు కేసుల్లో క్రిమినల్‌ దుష్ప్రవర్తన చర్యలను చేపట్టింది.

మరో 67 ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు.  అలాగే, 46 రెగ్యులర్‌ విచారణలు.. 32 డిస్‌క్రీట్‌ విచారణలను చేపట్టారు. దీంతో ఈ కాల్‌ సెంటర్‌ సూపర్ ‌హిట్‌ అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే, వస్తున్న కాల్స్‌ ద్వారా ఏఏ శాఖల్లో ఏఏ అంశాలపై అక్రమార్కులు ప్రజలను లంచాలు డిమాండ్‌ చేస్తున్నారో ఏసీబీ గుర్తించింది. దీని ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వారి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా  రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్య, విద్యుత్‌ శాఖల్లో అక్రమార్కులపై ప్రధానంగా నిఘా పెట్టనుంది
Tags:    

Similar News