సండ్రను ఫ్రెష్‌గా రమ్మంటున్నారు

Update: 2015-07-04 11:41 GMT
ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేయటం.. అందుకు ఆయన.. వైద్య చికిత్సకు వెళ్లిపోవటం.. దీంతో నోటీసుల్లో పేర్కొన్న గడువు లోపల విచారణకు హాజరుకాకపోవటం లాంటివి జరిగిపోయాయి.

తాను అనారోగ్యంగా ఉన్నానని.. పది రోజులు చికిత్స అవసరమని వైద్యులు చెప్పారంటూ విచారణకు హాజరు కాని సండ్ర.. తాజాగా తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తనను ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఏసీబీ సండ్రకు నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల లోపు విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి రావాల్సిందిగా సూచించారు. పనిలో పనిగా మరొకొందరు తెలుగుదేశం నేతల్ని విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక.. ఈసారి ఏసీబీ విచారణకు సండ్ర హాజరు అవుతారన్న సమాచారం అందుతోంది. ఏసీబీ పేర్కొన్న విధంగానే సోమవారం ఆయన విచారణకు హాజరవుతారని.. ఉదయం పది గంటల ప్రాంతంలో ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి.. సోమవారం లోపు మరెన్ని ఘటనలు చోసుకుంటాయేమో..!

Tags:    

Similar News