111 జీవోపై మ‌ళ్లీ రాజ‌కీయ వేడి

Update: 2021-09-03 08:30 GMT
జీవో నంబ‌ర్ 111.. దాదాపు రెండున్న‌ర‌ ద‌శాబ్దాలుగా తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ధానాస్త్రంగా మారింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించిన త‌ర్వాత కూడా ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి ఈ జీవోను ర‌ద్దు అంశాన్ని త‌మ గెలుపు కోసం రాజ‌కీయ పార్టీలు వాడుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జీవో ర‌ద్దు అంశంపై సీఎం కేసీఆర్‌ను ల‌క్ష్యంగా చేసుకుని బీజేపీ విమ‌ర్శించ‌డంతో మ‌రోసారి ఈ అంశం చ‌ర్చ‌లోకి వ‌చ్చింది. ఏళ్లుగా ఎన్నిక‌ల నినాదంగా కొన‌సాగుతున్న ఈ జీవో ర‌ద్దు అంశంపై అస‌లు టీఆర్ఎస్ స‌ర్కారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుంద‌నే ఆస‌క్తి రేకెత్తుతోంది.

1996లో టీడీపీ హ‌యాంలో హైద‌రాబాద్ శివారులోని ఉస్మాన్‌సాగ‌ర్‌, హిమాయ‌త్‌సాగ‌ర్‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం అప్ప‌టి ఉమ్మ‌డి ఏపీ ప్ర‌భుత్వం 111 జీవోను తీసుకొచ్చింది. జంట జ‌లాశ‌యాల ప‌రివాహ‌క ప్రాంతాల్లో నిర్మాణాలు చేప‌ట్ట‌డం ద్వారా జ‌లాశ‌యాలు క‌లుషితం కాకుండా చూడ‌డ‌మే ఈ జీవో ల‌క్ష్యం. ఈ జీవో ప‌రిధిలో మొత్తం 84 గ్రామాలున్నాయి. అయితే జీవోపై ఈ గ్రామ‌స్థులు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో అప్ప‌టి నుంచి వివాదం న‌డుస్తూనే ఉంది. ఎన్నిక‌ల వ‌చ్చిన‌పుడ‌ల్లా రాజ‌కీయ నాయ‌కుల‌కు ఈ జీవోను ర‌ద్దు చేస్తామ‌ని చెప్పుకుని ఆ గ్రామాల ప్ర‌జ‌ల ఓట్లు పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నుంచి ఇప్ప‌టి సీఎం కేసీఆర్ వ‌ర‌కూ అంద‌రూ ఈ జీవోను ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చిన‌వాళ్లే.

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్ర‌కారం 111 జీవోను ర‌ద్దు చేస్తామ‌ని అసెంబ్లీలో కూడా కేసీఆర్ ప్ర‌స్తావించారు. జీవో ర‌ద్దుపై ఇబ్బందుకు రాకుండా ఉండేందుకు సీఎస్ నేతృత్వంలో హైప‌వ‌ర్ క‌మిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ ఏర్పాటై నాలుగేళ్లు గ‌డిచినా ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి నివేదిక అందించ‌లేదు. ఇప్పుడిదే అంశాన్ని పేర్కొంటూ ప్ర‌తిప‌క్ష పార్టీలు టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఈ క‌మిటీ నివేదిక ఇవ్వ‌క‌పోవ‌డంపై హైకోర్టు కూడా స‌ర్కార్‌ను నిల‌దీసింది. దీంతో నాలుగేళ్లు గ‌డిచినా ఈ క‌మిటీ ఇంకా ఎందుకు నివేదిక ఇవ్వ‌లేద‌నే అంశంపై చ‌ర్చలు మొద‌ల‌య్యాయి.

111 జీవో ర‌ద్దుపై కేసీఆర్ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని చెప్ప‌డం కోసం ఆ జీవో ర‌ద్దుపై కేసీఆర్ ప్ర‌ణాళిక ప్ర‌కారం వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ జీవో ర‌ద్దుక ప్ర‌ధానంగా.. ప‌రివాహ‌క ప్రాంతాల్లో నిర్మాణాలు చేప‌ట్ట‌డం ద్వారా జంట జ‌లాయ‌శాలు క‌లుషిత‌మ‌వుతాయనే సుప్రీం కోర్టు తీర్పు అడ్డంకిగా ఉంద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు చెప్తున్నాయి. దీంతో హైద‌రాబాద్ ప్ర‌జ‌ల తాగునీరు కోసం ఈ జంట జ‌లాశ‌యాల నుంచి నీటిని తీసుకోకుండా ఉండేందుకు ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌లు మొద‌లెట్టింది. ఇప్ప‌టికే రాజ‌ధానికి కృష్ణా, గోదావ‌రి నుంచి తాగునీరు తీసుకొచ్చిన ప్ర‌భుత్వం.. న‌గ‌రం న‌లువైపులా నాలుగు జ‌లాశ‌యాల‌ను నిర్మిస్తోంది. దీంతో ఈ జంట జ‌లాశ‌యాల నుంచి తాగునీరుకు నీటిని వాడ‌ట్లేదు కాబ‌ట్టి అప్పుడు ఈ నీరు క‌లుషిత‌మైన ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌నే విష‌యాన్ని వెలుగులోకి తెచ్చి న్యాయ‌స్థానాల్లో ఈ జీవో ర‌ద్దుకు ఉన్న అడ్డంకుల‌ను అధిగ‌మించేందుకు కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్లు టాక్‌. దీంతో ఇప్పుడు విమ‌ర్శ‌ల‌పై మౌనంగానే ఉన్న ప్ర‌భుత్వం.. జీవో ర‌ద్దుకు పూర్తి క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News