ఎప్‌స్టీన్‌కు సాయం ఆరోపణలు.. బాధితురాలికి వందల కోట్ల పరిహారం ఇవ్వనున్న బ్యాంక్

దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి సామ్రాజ్యంలో బాధితులకు న్యాయం చేసే క్రమంలో బ్యాంకింగ్ రంగంలోని దిగ్గజ సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది.;

Update: 2026-03-28 22:30 GMT

జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసు అంతర్జాతీయంగా మరోసారి చర్చనీయాంశమైంది. దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి సామ్రాజ్యంలో బాధితులకు న్యాయం చేసే క్రమంలో బ్యాంకింగ్ రంగంలోని దిగ్గజ సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎప్‌స్టీన్ బాధితురాలు వేసిన దావాను పరిష్కరించుకోవడానికి ఏకంగా రూ. 687 కోట్లు ($82.5 మిలియన్లు) చెల్లించేందుకు అంగీకరించింది. ఈ సెటిల్‌మెంట్ బ్యాంకింగ్ చరిత్రలో ఒక కీలక మలుపుగా పరిగణించబడుతోంది.

కేసు నేపథ్యం.. బ్యాంకుపై తీవ్ర ఆరోపణలు

జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక అక్రమ రవాణా.. వేధింపుల ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతనికి ఆర్థిక సేవలు అందించిన బ్యాంకులు కూడా నేరస్థుడికి పరోక్షంగా సహకరించాయని బాధితులు ఆరోపించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఒక అజ్ఞాత మహిళ బ్యాంక్ ఆఫ్ అమెరికాపై న్యాయపరమైన చర్యలు ప్రారంభించారు.

ఆమె దావాలోని ప్రధానాంశాలు ఇవే..

ఎప్‌స్టీన్‌కు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడంలో రిపోర్ట్ చేయడంలో బ్యాంక్ విఫలమైంది. బాధితుల భద్రత.. నైతిక విలువల కంటే, వ్యాపార లాభాలకే బ్యాంక్ ప్రాధాన్యత ఇచ్చింది. ఎప్‌స్టీన్ తన లైంగిక అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నడపడానికి అవసరమైన నిధులను బదిలీ చేయడంలో బ్యాంక్ నిబంధనలను పక్కన పెట్టిందని ఆరోపించారు.

కోర్టు విచారణ.. జడ్జి వ్యాఖ్యలు

ఈ కేసుపై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జెడ్ రకాఫ్ జనవరిలో కీలక విచారణ జరిపారు. విచారణ సందర్భంగా బ్యాంకు వైఖరిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్ అక్రమ కార్యకలాపాల గురించి ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ బ్యాంక్ అధికారులు వాటిని చూసీచూడనట్లు వదిలేశారని జడ్జి అభిప్రాయపడ్డారు. బ్యాంకు తన అంతర్గత పర్యవేక్షణ వ్యవస్థలను సరిగ్గా వినియోగించి ఉంటే ఈ నేరాలను ముందే అరికట్టే అవకాశం ఉండేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈ ఆరోపణలను ప్రారంభం నుండి తోసిపుచ్చుతూనే వచ్చింది. ఎప్‌స్టీన్ చేసే నేరాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము కేవలం సాధారణ బ్యాంకింగ్ సేవలు మాత్రమే అందించామని వాదించింది.

రూ. 687 కోట్ల భారీ సెటిల్‌మెంట్

న్యాయపరమైన పోరాటం సుదీర్ఘంగా సాగితే బ్యాంక్ ప్రతిష్ఠకు మరింత భంగం కలుగుతుందని భావించిన యాజమాన్యం రాజీ మార్గాన్ని ఎంచుకుంది. బాధితురాలితో చర్చలు జరిపి సుమారు రూ. 687 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు పక్షాలు కుదుర్చుకున్న ఈ భారీ డీల్ గురించి కోర్టుకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ సెటిల్‌మెంట్ ప్రాథమిక దశలో ఉంది. జడ్జి రకాఫ్ దీనిని పరిశీలించి, తుది ఆమోదం తెలపాల్సి ఉంది. గతంలో జేపీ మోర్గాన్, డ్యూయిష్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా ఎప్‌స్టీన్ కేసులో భారీ జరిమానాలు.. సెటిల్‌మెంట్‌లు చేసుకున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో బ్యాంక్ ఆఫ్ అమెరికా చేరింది.

ఆర్థిక సంస్థల బాధ్యతపై చర్చ

ఈ సెటిల్‌మెంట్ కేవలం డబ్బు చెల్లింపు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలు తమ క్లయింట్ల కార్యకలాపాలపై ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తోంది. నేరగాళ్లకు ఆర్థిక వ్యవస్థను వినియోగించుకునే అవకాశం కల్పించడం కూడా నేరమేనని ఈ తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. బాధితులకు ఈ మొత్తం ఆర్థికంగా కొంత ఊరటనిచ్చినా వారు అనుభవించిన మానసిక వేదనకు ఇది వెలకట్టలేనిదని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

ముందు ముందు ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు బ్యాంకింగ్ రంగంలో మరిన్ని కఠిన నిబంధనలు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News