బాబు ఉప ప్రధాని... గొప్ప సంగతే అన్న జగన్
ఇక అసెంబ్లీలో పవన్ మాట్లాడుతూ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 1100 మందిగా కనిపిస్తున్నారు అన్న వ్యాఖ్యల మీద కూడా జగన్ స్పందించారు.;
చంద్రబాబు త్వరలో ఉప ప్రధాని కాబోతున్నారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీని మీద తనదైన శైలిలో స్పందించారు. గొప్ప సంగతే అంటూనే ఆయనను ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నామని ఉప ప్రధాని అయితే దేశమంతా ఎలా భరిస్తుందని సెటైర్లు వేశారు. ఇటీవల కాలంలో మీడియాలో జరుగుతున్న ప్రచారం జగన్ దృష్టికి ఒక విలేకరి తీసుకెళ్ళినపుడు చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని అవుతారని వాళ్ళ మీడియాలో రాసుకుంటున్నారా అని జగన్ కామెంట్స్ చేసారు.
మంచిగానే చెప్పారుగా :
ఇక అసెంబ్లీలో పవన్ మాట్లాడుతూ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 1100 మందిగా కనిపిస్తున్నారు అన్న వ్యాఖ్యల మీద కూడా జగన్ స్పందించారు. మంచిగానే చెప్పారుగా అని అంటూనే అది మా ఎమ్మెల్యేల నిబద్ధత, ఆ క్రెడిట్ వారికి ఇవ్వాల్సిందే అని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు పట్ల జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒరిగిందేముంది :
పదహారు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల వల్ల ఒరిగింది ఏమీ లేదని ఆయన తేల్చేసారు. రైతుల కష్టాల గురించి సమావేశాల్లో మాట్లాడింది లేదని విమర్శించారు రైతన్నలు ఇబ్బందుల్లో ఉంటే ఎమ్మెల్యేలు ఆటలు స్కిట్లతో కాలక్షేపం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం పెను సంక్షోభంలో ఉందని రైతు కూలీలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందని ఆయన అన్నారు.
ఆత్మ స్తుతితోనే :
అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యల మీద చర్చ జరగాలని, కానీ ఆత్మ స్థితి పర నిందతోనే సాగిందని జగన్ విమర్శించారు ఈ సమావేశాల వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమిటని ప్రశ్నించారు ఇప్పటికి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టారు కానీ జనాలకు ఏమైనా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఏ మాత్రం నెరవేర్చాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు
చర్యలు లేవు :
ఏపీలో మహిళల మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఏకంగా కూటమి ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తే చర్యలు లేవని జగన్ మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ విషయంలోనూ ఈ తరహా ఆరోపణలు వచ్చినా బాబు పట్టించుకోలేదని అన్నారు దేవుడి ఆలయాలలో పవిత్రత భక్తి గురించి మాట్లాడే అర్హత కూటమి పెద్దలకు ఉందా అని ఆయన నిలదీశారు. చంద్రబాబు హయాంలోనే ఎంతో మంది భక్తులు ఆలయాలకు దర్శనానికి వచ్చి చనిపోయారని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ ప్రభుత్వం నిర్లక్ష్యమైన వైఖరి వల్లనే జరిగాయని ఆయన అన్నారు.