బీజేపీలో చేరకపోతే చంపేస్తాం: దీప్కేకు బెదిరింపులు
ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ ఉదంతంపై ఉద్యమించిన అభిజిత్ దీప్కేకు.. కొందరు బెదింపుల ఫోన్లు చేసినట్టు స్వయంగా ఆయనే వెల్లడించారు.
కాక్రోచ్ జనతా పార్టీ అనే ఉద్యమ సంస్థను స్థాపించి విద్యార్థుల సమస్యలపై ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ ఉదంతంపై ఉద్యమించిన అభిజిత్ దీప్కేకు.. కొందరు బెదింపుల ఫోన్లు చేసినట్టు స్వయంగా ఆయనే వెల్లడించారు. గురువారం మీడియా ముందుకు వచ్చిన దీప్కే.. తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్టు వెల్లడించారు. బీజేపీలో చేరకపోతే.. నీకు, నీ కుటుంబానికి కూడా ప్రాణాలు దక్కవని హెచ్చరించినట్టు తెలిపారు.
బీజేపీలో చేరితే అంతా బాగుంటుందని.. లేకపోతే అంతా నాశనమేనని వారు బెదిరిస్తున్నట్టు దీప్కే పేర్కొన్నారు. అయితే.. ఆ ఫోన్లకు తిరిగి తాను ఫోన్ చేయగా.. అవి పనిచేయడం లేదన్నారు. దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చామని, కేసు నమోదు చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉండాలని చెప్పినట్టు దీప్కే వివరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని.. ఇలా బెదిరింపులకు దిగడం సరికాదని ఆయన చెప్పారు.
తన తల్లిదండ్రులు వృద్ధులని, వారికి ప్రాణ హాని ఉందని చెప్పారు. తనను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నట్టు దీప్కే చెప్పారు. ప్రస్తుతం కుటుంబంలో ఈ వ్యవహారం గందరగోళంగా ఉందని తెలిపారు. తమ కుటుంబానికి నిద్రలేకుండా పోయిందన్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. మరోవైపు.. అమెరికాలో ఉన్నప్పుడు కూడా.. దీప్కేకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. కాక్రోచ్ జనతాపార్టీ స్థాపించిన మే నెలలో ఆయనకు బెదిరింపు ఫోన్లు వచ్చాయని తెలిపారు.
ఈ ఘటనలకు బాధ్యత ఎవరిది?
ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలపై పోలీసులు పెల్లెట్ గన్లను వినియోగించారని దీప్కే పేర్కొన్నా రు. ఇలా కాల్పులు జరపమని ఎవరు ఆదేశించారు? దీని వెనుక ఎవరు ఉన్నారన్న విషయాలను కేంద్ర హోం శాఖ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ, ఇప్పటి వరకు కేంద్రం ఈ విషయంపై స్పందించలేదన్నారు. హోం మంత్రి అమిత్ షా సభకు రాకుండా ప్రకటన కూడా చేయకుండా తాత్సారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు చేసుకునే హక్కు ఉంటుందని చెప్పారు.