మరోసారి విజృంభించిన మహమ్మారి.. ఆందోళన వ్యక్తం చేస్తున్న WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా విడుదల చేసిన నివేదిక ఆందోళనకరమైన వాస్తవాన్ని బయటపెట్టింది. క్షయ వ్యాధి (Tuberculosis) ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్నది.;
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా విడుదల చేసిన నివేదిక ఆందోళనకరమైన వాస్తవాన్ని బయటపెట్టింది. క్షయ వ్యాధి (Tuberculosis) ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్నది. 2024లో మొత్తం 83 లక్షల మంది కొత్తగా టీబీ బారిన పడ్డారని WHO వెల్లడించింది. ఇది గతేడాదితో పోలిస్తే గణనీయమైన పెరుగుదల అని పేర్కొంది. అయితే కొంత ఊరటనిచ్చే విషయం ఏంటంటే, మరణాల సంఖ్య మాత్రం తగ్గింది. కరోనా మహమ్మారి మన ఆరోగ్య వ్యవస్థపై వేసిన ప్రభావం ఇప్పటికీ పూర్తిగా తగ్గలేదనే సంకేతమే ఇది. మహమ్మారి సమయంలో టీబీ పరీక్షలు, చికిత్సలు నిలిచిపోవడం, వైద్య సదుపాయాలు ఇతర అత్యవసర సేవలకు మళ్లించడం వల్ల లక్షలాది కేసులు గుర్తించలేదు. అయితే మహమ్మారి అనంతరం ప్రభుత్వాలు, వైద్య సంస్థలు పెద్ద ఎత్తున స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో నిర్ధారణలు పెరిగినట్లు WHO స్పష్టం చేసింది.
పెరిగిన కేసుల సంఖ్య..
నివేదిక ప్రకారం, 2023లో టీబీ వల్ల 12.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, 2024లో ఈ సంఖ్య 12.3 లక్షలకు తగ్గింది, దీన్ని బట్టి పరిశీలిస్తే ప్రపంచ వ్యాప్తంగా వైద్య వ్యవస్థలు సరైన దిశలో కదులుతున్నాయన్న సంకేతం ఇస్తుంది. కానీ కొత్త కేసుల పెరుగుదల మాత్రం ఆందోళనకరం. ముఖ్యంగా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా టీబీ కేసులు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. WHO గణాంకాల ప్రకారం.. అమెరికాలో నమోదైన కొత్త కేసుల్లో ఎక్కువ శాతం ఇతర దేశాల్లో జన్మించిన వ్యక్తులే ఉన్నారు. ఇది గ్లోబలైజేషన్, వలసల కారణంగా వ్యాధులు సరిహద్దులు దాటి ప్రయాణిస్తున్నాయన్న వాస్తవాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
స్తబ్ధుగా ఉండే వైరస్..
ప్రపంచ జనాభాలో దాదాపు 25 శాతం మందిలో టీబీ బ్యాక్టీరియా ఉన్నా, వారిలో కొద్ది మందిలోనే వ్యాధి బయటకు కనిపిస్తుంది. ఇది టీబీ మోసపూరిత స్వభావం. అది శరీరంలో స్తబ్ధుగా సంవత్సరాల తరబడి ఉండగలదు. రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది. టీబీ ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంటువ్యాధుల్లో ఒకటిగా గుర్తించారు.
WHO ప్రతి సంవత్సరం విడుదల చేసే గ్లోబల్ టీబీ రిపోర్ట్ 184 దేశాల సమాచారం ఆధారంగా సిద్ధమవుతుంది. ఈసారి అందులో ప్రధానంగా రెండు విషయాలు బయటపడ్డాయి. మొదటిది ఆరోగ్య మౌలిక సదుపాయాలు తిరిగి పుంజుకుంటున్నాయి. రెండోది పేద, మధ్య ఆదాయ దేశాల్లో టీబీ ఇంకా సవాలుగానే ఉంది.
ఈ దేశాలకు ఇంకా సవాలే..
భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ వంటి దేశాలు ప్రపంచ టీబీ భారంలో అగ్రస్థానంలో ఉన్నాయి. భారత్ ఒక్కదానిలోనే ప్రపంచ టీబీ కేసుల దాదాపు 28 శాతం నమోదవుతున్నాయి. ప్రభుత్వం నిక్షయ్ పోర్టల్ ద్వారా కేసుల ట్రాకింగ్, ఉచిత చికిత్స, అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, పేదరికం, పోషకాహార లోపం వంటి సామాజిక సమస్యలు టీబీ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి.
సామాజిక సమస్యగా చూడాలి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీబీని కేవలం వైద్య సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పౌష్టికాహారాన్ని అందించడం, వలస కార్మికులకు వైద్య సదుపాయాలు చేరవేయడం వంటి సమగ్ర చర్యలు అవసరం. WHO నివేదిక చివరగా ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. ‘క్షయవ్యాధి అంతం చేయాలంటే కేవలం మందులతోనే కాదు.. మానవ వ్యవస్థలో ఉన్న అసమానతలను కూడా నయం చేయాలి.’ అదే సమయంలో, టీబీ నిర్ధారణ సదుపాయాలు ప్రతి గ్రామస్థాయికి చేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. లేకపోతే, క్షయవ్యాధి మన శతాబ్దపు నిశ్శబ్ద మహమ్మారిగా నిలిచిపోతుంది.