జగన్ ని ఫాలో అవుతున్న గడ్కరీ... ఓటడిగే విషయంలో కొత్తస్టైల్!

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-10-01 15:53 GMT

తన పాలన నచ్చితే.. తన పాలన వల్ల మీకు, మీ ఇంటికీ మంచి జరిగితే తనకు ఓటెయ్యండి, మీ బిడ్డను బలపరచండి అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతకొంతకాలంగా చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే ఓటు వేయాలని ఆయన కోరుతున్నారు. ఈ సమయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో ఎలాంటి పోస్టర్లు లేదా బ్యానర్లు వేయకూడదని నిర్ణయించుకున్నానని, మరెలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదనుకున్నానని, ఇదే సమయంలో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయనని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలోని వాషిం లో జరిగిన ఓ కొత్త రహదారి ప్రారంభించారు గడ్కరీ. అనంతరం ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. "నేను మీకు సేవ చేశాను. అది మీకు నచ్చితే ఓటు వేయండి.. మీకు ఇష్టం లేకపోతే నాకు ఓటు వేయవద్దు" అని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా... "వచ్చే ఎన్నికల్లో ఎటువంటి బ్యానర్లు, పోస్టర్లు వేయించకూడదని నిర్ణయించుకున్నాను.. అలాగే, ఛాయ్ కూడా ఇవ్వకూడదని అనుకుంటున్నాను.. మీకు డబ్బులు పంచను.. స్వదేశీ లేదా విదేశీ మద్యం కూడా పోయించను.. నేను అవినీతిలో కూరుకుపోను.. మిమ్మల్ని అందులో మునిగిపోనివ్వను" అని గడ్కరీ అన్నారు.

కాగా కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ.. నాగ్‌ పూర్ పార్లమెంట్ సీటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News