ఎస్.. ఆ 'రెండు' మాకే.. సెగ్మెంట్ల ముచ్చట..!
ఒకే కుటుంబానికి రెండు టికెట్లు. ఈ విషయం కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. నిజమే. గత ఎన్నికల్లో టీడీపీ ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.;
ఒకే కుటుంబానికి రెండు టికెట్లు. ఈ విషయం కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. నిజమే. గత ఎన్నికల్లో టీడీపీ ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేషలు.. పోటీ చేశారు. అదేవిధంగా పుట్టా సుధాకర్, పుట్టా మహేష్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఒకే కుటుంబం నుంచి రెండేసి టికెట్లు దక్కించుకున్నారు. వీరంతా విజయం దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికలపై మరింత మంది ఇదే పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కూటమి పార్టీల్లో టీడీపీ నుంచి ఈ తరహా ప్రతిపాదనలు ఎక్కువగా వస్తున్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు చొప్పున బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చలకే పరిమితం అయింది. ఇలాంటి వారిలో దామచర్ల ఫ్యామిలీ నుంచి సత్య, జనార్దన్(ప్రస్తుత ఎమ్మెల్యే), ఆనం ఫ్యామిలీ నుంచి వివేకా కుమారుడు, ఆనం రామనారాయణ రెడ్డి, సోమి రెడ్డి కుటుంబం నుంచి ఆయన సహా ఆయన కుమారుడు పోటీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక, పరిటాల కుటుంబం నుంచి కూడా తల్లితనయులు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇలా మరికొందరు కూడా తమ ప్రతిపాదనలు పంపుతున్నారు. కానీ.. ఒక్కరికి మాత్రమే సీట్లు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయి పరిస్థితి.. వారి గ్రాఫ్ ఆధారంగానే వచ్చే ఎన్నికలకు టికెట్లను ఖరారు చేయనున్నారు. అయితే.. తమకు వేరే ఏదైనా పదవి ఇవ్వాలంటూ.. ఇండెంట్లు పెడుతున్న తీరు ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.
ఉదాహరణకు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఎమ్మెల్యేగా ఉండగా.. ఆయన తండ్రి రామయ్య.. పార్టీ పొలిట్బ్యూరోలో సభ్యత్వం కలిగి ఉన్నారు. ఈయన వచ్చే ఎన్నికలలోపు తనను రాజ్యసభకు పంపించా లని కోరుకుంటున్నారు. విజయవాడలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉండగా.. ఆయన సతీమణి కూడా పార్టీ పదవిలో ఉన్నారు. కానీ, వచ్చే ఎన్నికల నాటికి ఇద్దరికీ చెరో నియోజకవర్గం కోరుతున్నారు. ఇలా పార్టీలో రెండేసి పదవులు కోరుతున్నవారి సంఖ్య పెరుగుతుండడం గమనార్హం.