జనసేన సభకు అనుమతి నో !
తెలంగాణాలో హైదరాబాద్ రాజధానిగా గచ్చీబౌలీలో జనసేన నవ నిర్మాణ సభని నిర్వహించాలని నిర్ణయించింది.
తెలంగాణాలో హైదరాబాద్ రాజధానిగా గచ్చీబౌలీలో జనసేన నవ నిర్మాణ సభని నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకులను దృష్టిలో ఉంచుకుని జనసేన నిర్వహిస్తున్న ఈ సభ మీద అందరి దృష్టి కేంద్రీకృతం అయింది. అదే సమయంలో ఈ సభను పెట్టే టైం టైమింగ్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ అలాగే రాజకీయ రచ్చ కూడా సాగింది. ఈ నేపధ్యంలో జనసేన సభకు అనుమతిని నిరాకరిస్తూ తెలంగాణా పోలీసులు కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
కొద్ది రోజుల ముందు నుంచి :
సాధారణంగా రాజకీయ పార్టీలు ఎక్కడైనా సభను జరుపుకునే హక్కుని స్వేచ్చను కలిగి ఉంటాయి. జనసేన విషయం తీసుకుంటే కొద్ది రోజుల ముందు ఈ సభను నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. ఈ సభ కూడా గచ్చీబౌలీ లోని సంధ్యా కన్వెన్షన్ హాలులో నిర్వహించనున్నారు. ఇది ఓపెన్ గా నిర్వహించే సభ కాదు, ఇండోర్ మీటింగ్. అయినా దానికి అనుమతి నిరాకరించడం పట్ల చర్చ సాగుతోంది.
నేపథ్యం చూస్తే :
ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణా మేధావులు ప్రజా సంఘాలు కొందరు ప్రెస్ క్లబ్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ కి మద్దతుగా మాట్లాడుతూ జనసేన మీద పవన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆ వేడి అలా కంటిన్యూ అవుతోంది. ఈ నేపధ్యంలోనే జనసేన తెలంగాణా శాఖ ఒక సభను నిర్వహించుకుంటామని ప్రకటించింది. అయితే ఒక వైపు తెలంగాణా ఫార్మేషన్ డే మరో వైపు పవన్ మీద తెలంగాణావాదులు తీవ్ర విమర్శలు చేయడం ఆంధ్రా తెలంగాణా అంటూ విభజన రేఖ గీసి మరీ హాట్ కామెంట్స్ చేయడం జరుగుతూ వస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే నవ నిర్మాణ సభ మీద విమర్శలు చేశారు. పవన్ గురించి కూడా కామెంట్స్ చేశారు. ఇంకో వైపు తెలంగాణా రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కూడా ఏపీలో సభ పెట్టుకోవాలి తప్పించి తెలంగాణాలో కాదని చెప్పారు. అదే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు కూడా విమర్శలు చేయడంతో వాతావరణం అయితే హీటెక్కింది. ఈ నేపథ్యంలో జనసేన సభకు అనుమతి నిరాకరణ అయింతే చర్చనీయాంశం అయింది.
జనసేన ఫైర్ :
తమ సభను గచ్చీ బౌలీ సంధ్య కన్వెన్షన్ హాలులో నిర్వహించుకోవడానికి కూడా అనుమతి నిరాకరించడం పట్ల జనసేన సామాజిక మాధ్యమం ద్వారా ఫైర్ అయింది. కేవలం పార్కింగ్ సమస్యను సాకుగా చూపించి అనుమతికి నో చెప్పడం సరికాదు అని పేర్కొంది. ప్రతీ రోజూ ఎన్నో సమావేశాలు ఆ కన్వెన్షన్ హాలు వద్ద జరుగుతాయని కూడా తెలిపింది. ఇండోర్ మీటింగ్ కి అనుమతి ఇవ్వకపోవడం బాధాకరం అని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణాలో ఉన్న కొండగట్టు ఆలయానికి పవన్ సొంత సొమ్ము విరాళంగా ఇచ్చినపుడు లేని ప్రాంతీయ సెంటిమెంట్లు జనసేన పుట్టిన నేలలో ఆ పార్టీ నేతలు సమావేశం అయితే వస్తున్నాయా అని ప్రశ్నించింది.
న్యాయ పోరాటం :
ఇక ఈ విషయం మీద జనసేన పట్టుదలగా ఉందని అంటున్నారు. కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకోవాలని చూస్తోంది అని కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో ఏమి చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. టైం చూస్తే చాలా తక్కువగా ఉంది. చివరి నిముషం వరకూ సభకు అనుమతి వస్తుందని తెలంగాణా జనసేన నేతలు అంతా భావించారు. అయితే ఇపుడు కేవలం కొద్ది గంటలు ఉంది అనగా నో చెప్పారు దాంతో న్యాయపరంగా ఏమైనా ఆలోచనలు చేస్తారా అన్నది అయితే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.