విచారణకు రండి: కడియానికి పిలుపు
ఈ నేపథ్యంలో తాజాగా స్పీకర్ ప్రసాదరావు నుంచి కడియంకు నోటీసులు వెళ్లాయి. బుధవారం తన ముందుకు విచారణకు రావాలని ఆదేశించారు.;
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ తరఫున ఎన్నికై... తర్వాత కాలంలో అధికార పార్టీ కాంగ్రెస్కు మద్దతు దారులుగా మారిపోయిన.. 10 మంది ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ప్రసాదరావు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 8 మందికి స్పీకర్ ప్రసాదరావు.. క్లీన్ చిట్ ఇచ్చారు. వారంతా బీఆర్ ఎస్లోనే ఉన్నారని.. వారు పార్టీ మారినట్టుగా ఎక్కడా ఆధారాలు లేవని తేల్చేశారు.
ఇక, మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ సంగతి మరోసారి డోలాయమానంలో పడింది. తాను బీఆర్ ఎస్లోనే ఉన్నానని.. తాను ఆపార్టీని వీడడం కానీ.. లేదా ఆ పార్టీ తనను సస్పెండ్ చేయడం కానీ.. జరగలేదని జరగలేదని తెలిపారు. దీంతో తాను బీఆర్ ఎస్లోనే ఉన్నట్టుగా అర్ధం అవుతుందన్నారు. దీనికి ప్రత్యేక వివరణలు.. విచారణలు ఎందుకని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన అనర్హత పిటిషన్ను కొట్టి వేయాలని కోరుతూ.. స్పీకర్కు లేఖ రాశారు.
ఇక, ఇప్పుడు మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి వ్యవహారం తెరమీదికి వచ్చింది. ఆయన కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయమంటే చేస్తానని.. మరోసారి ఎన్నికలకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇక, తరచుగా బీఆర్ ఎస్పైవిమర్శలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కడియం విచారణ కీలకంగా మారింది. గతంలోనే రెండు సార్లు ఆయనకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ, వ్యక్తిగత కారణాలతో ఆయన రాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా స్పీకర్ ప్రసాదరావు నుంచి కడియంకు నోటీసులు వెళ్లాయి. బుధవారం తన ముందుకు విచారణకు రావాలని ఆదేశించారు. ఉదయం 11 గంటలకు జరిగే విచారణకు తప్పని సరిగా హాజరు కావాలని కోరారు. ఆయన వెంట న్యాయవాదిని అనుమతించనున్నారు. మరి ఈ విచారణలో ఏం తేలుతుందో చూడాలి. కడియం విచారణతో మొత్తం ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్టు అవుతుంది.