ఆ రెండు అంశాలే మహనాడులో హైలెట్ !

తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాత్రిగా తన ముద్రను మరోసారి బలంగా వేసుకోగలిగింది అని అంటున్నారు.

Update: 2026-05-29 18:30 GMT

తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన మహనాడు సూపర్ సక్సెస్ అయింది అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తాము చెప్పాల్సిన అంశాలను అటు ప్రజలకు ఇటు పార్టీ జనాలకూ స్పష్టంగా పంపించగలిగామని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈసారి మహానాడు గతానికి భిన్నంగా హైబ్రీడ్ విధానంలో జరిగింది. అయిన సరే ఎక్కడా ఉత్సాహం క్యాడర్ లో తగ్గకుండా పార్టీ చూసుకోగలిగింది. అదే విధంగా 1875 క్లస్టర్ల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయని టీడీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈసారి మహానాడు రెండు కీలక అంశాలలో దిశా నిర్దేశం చేయడమే కాకుండా సందేశం క్యాడర్ కి బలగంగా పంపించగలిగింది అని అంటున్నారు.

మహిళల పక్షంగా :

తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాత్రిగా తన ముద్రను మరోసారి బలంగా వేసుకోగలిగింది అని అంటున్నారు. మొదటి నుంచి మహిళలకు ఆస్తిలో వాటా విషయం కానీ స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు కానీ మహిళా విశ్వవిద్యాలయం కానీ ఇలా అనేక అంశాలలో టీడీపీ ఆదర్శంగా నిలిచింది అని గుర్తు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి మహానాడులో ఒక కీలక ప్రకటన ద్వారా మొత్తం మహిళా సమాజాన్ని ఆకట్టుకునేలా చేసుకుంది అని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే అది సంచలన ప్రకటన కిందనే చూస్తున్నారు. అంతే కాదు దేశంలో ఎక్కడా అది ఎవరూ అమలు చేయలేదని అంటున్నారు. ఆ విధంగా మహిళా శక్తిని తమ వైపు తిప్పుకునేలా టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం భవిష్యత్తులో పార్టీకి ఎంతగానో మేలు చేస్తుందని కలిసి వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.

కార్యకర్త కేంద్రంగా :

అంతే కాకుండా ఈసారి మహానాడులో వేదిక మీద కనిపించిన వారు పాల్గొని మాట్లాడిన వారిలో సీనియర్లతో పాటు కొత్త వారు యువత ఎక్కువ మంది ఉన్నారు. పొలిట్ బ్యూరోలోనూ కీలక పార్టీ పదవులలోనూ సమర్ధంగా పనిచేసే వారిని ఎంపిక చేయడం వల్లనే ఇది సాధ్యపడింది అని అంటున్నారు. అంతే కాకుండా కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామని పార్టీ అధినాయకత్వం గట్టిగా చెప్పగలిగింది అని అంటున్నారు. పార్టీ కోసం కష్టడే కార్యకర్తలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అని కూడా స్వయంగా అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. కార్యకర్తలలో అనుచరులు కాదు రేపటి నాయకులను చూడాలని పార్టీ ఇచ్చిన ఈ పిలుపు టీడీపీకి మేలు మలుపు అని అంటున్నారు.

టీడీపీకి అనుకూలంగా :

క్రమంగా టీడీపీ నిర్మాణం మారుతోంది. పార్టీలోకి కొత్త నెత్తురు వస్తోంది, యువతకు అనేక అవకాశాలు ఇస్తున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ మరో నలభై ఏళ్ళ పాటు ఇదే తీరున ఉత్సాహంగా పనిచేయడానికి నవతరాన్ని ముందుకు తీసుకుని రావాలన్న పార్టీ ఉద్దేశ్యం ఈ మహనాడు ద్వారా ప్రస్పుటం అయింది అని చెబుతున్నారు. అంతే కాకుండా మహిళలకు పెద్ద పీట వేయడం ద్వారా జనాభాలో సగం ఉన్న వారికి సముచిత న్యాయం కల్పీంచే పార్టీ టీడీపీ మాత్రమే అని గట్టిగా నొక్కి చెప్పినట్లు అయింది అని అంటున్నారు మొత్తానికి మహనాడు ద్వారా టీడీపీ తాను చెప్పాలనుకున్న బలమైన సందేశాన్ని పార్టీ జనాలకు ఏపీ ప్రజలకు కచ్చితంగా చేరేలా చూసుకుందని అంటున్నారు. వీటి ఫలితాలు రానున్న రోజులలలో టీడీపీకి అనుకూలంగా ఉంటాయని కూడా పార్టీ బలంగా నమ్ముతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News