నిర్ణయం బాగున్నా.. విజయ్కు అంత ఈజీకాదు!
తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన టీవీకే అధిపతి, నటుడు విజయ్.. తాజాగా సంచలన నిర్ణ యం తీసుకున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన టీవీకే అధిపతి, నటుడు విజయ్.. తాజాగా సంచలన నిర్ణ యం తీసుకున్నారు. రాష్ట్రంలో పాఠశాలలకు, మసీదులకు, చర్చిలకు.. రైతు బజార్లకు సమీపంలో ఉన్న లిక్కర్ షాపులను మూసివేయాలని ఆయన ఆదేశించారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 717 దుకాణాలు ఉన్నా యని అధికారులు ఆవెంటనే లెక్కులు తేల్చేశారు. వీటిని రెండు వారాల్లోనే మూసి వేయాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
విజయ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రాహర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సినీ రంగంలో ఆయనను సమర్థించేవారు దీనిని రికార్డు స్థాయి నిర్ణయంగా చెబుతున్నారు. మరికొందరు విజయ్ తీసుకున్న నిర్ణ యం బాగుందని.. ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పుడైనా చేశారని కొందరు వ్యాఖ్యానించారు. మొత్తంగా విజయ్ తీసుకున్న నిర్ణయంపై ఇటు ప్రజల్లోనూ.. అటు సినీ రంగ ప్రముఖుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. కానీ.. ఇక్కడే విజయ్ నిర్ణయం అమలుపై అనేక సందేహాలు ముసురుకున్నాయి.
గతంలో ఏపీలోనూ ఇదే తరహా ప్రయత్నం జరిగింది. ఏపీలో కూడా ప్రార్థనా మందిరాలు.. పాఠశాలలు.. ఆలయాలకు సమీపంలో ఉన్న దుకాణాలు మూసివేయాలంటూ.. జగన్ హయాంలో ఉత్తర్వులు ఇచ్చారు. కానీ, దీనిని వ్యతిరేకిస్తూ.. దుకాణాల యజమానులు ముందు హైకోర్టుకు.. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. రెండు చోట్ల కూడా.. దుకాణాల యజమానులకు అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. దీంతో అప్పటి సర్కారు వెనక్కి తగ్గింది.
``వారు(దుకాణదారులు) కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైసెన్సులు తీసుకున్నారు. మీరు(ప్రభుత్వం) లైసెన్సులు ఇచ్చేప్పుడు.. వారు ఎక్కడ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకుని ఇవ్వాలి. అంతేకానీ.. ఒకసారి లైసెన్సు ఇచ్చిన తర్వాత.. మూసివేయాలని ఆదేశించడం సరికాదు.`` అని కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే నియమం గతంలో కేరళలోనూ అనుసరించాల్సి వచ్చింది. దీంతో ఆయా దుకాణాల లైసెన్సుల గడువు పూర్తయ్యే వరకు వేచి ఉండి.. ఆ తర్వాత.. కేరళలో దుకాణాల ఏర్పాటుకు ప్రత్యేక విధానాలు తీసుకువచ్చారు. కానీ, ఏపీలో మాత్రం పాత విధానమే కొనసాగుతోంది. ఇక, ఇప్పుడు తమిళనాడులోనూ విజయ్ చేసిన ప్రకటనలకు సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారనుందని అంటున్నారు పరిశీలకులు.