ఒక్క ఫొటోతో గిల్ క్రిస్ట్ కు 24వేల మంది.. రోహిత్ క్రేజ్ పీక్స్ అంతే
క్రికెట్ ప్రపంచంలో “హిట్మ్యాన్” రోహిత్ శర్మకు ఉన్న అభిమానుల తాకిడి మరోసారి సోషల్ మీడియాలో కనిపించింది.;
క్రికెట్ ప్రపంచంలో “హిట్మ్యాన్” రోహిత్ శర్మకు ఉన్న అభిమానుల తాకిడి మరోసారి సోషల్ మీడియాలో కనిపించింది. ఆస్ట్రేలియా మాజీ లెజెండరీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ తన ఇన్స్టాగ్రామ్లో రోహిత్ శర్మతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేయగానే, ఒక్కసారిగా ఆయన ఫాలోవర్స్ సంఖ్య 24 వేల వరకూ పెరిగిపోయిందట! ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అడిలైడ్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్కు ముందు రోహిత్, గిల్క్రిస్ట్లు ముచ్చటించి సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫోటోను గిల్క్రిస్ట్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా అభిమానులు ఆ ఫొటోను విపరీతంగా షేర్ చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా గిల్లీ అకౌంట్కి కొత్తగా లక్షల వ్యూస్ రావడంతో పాటు 24 వేల కొత్త ఫాలోవర్స్ చేరినట్టు వార్తలు వస్తున్నాయి.
గిల్క్రిస్ట్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఐపీఎల్లో ఆడటం అభిమానులకు గుర్తుండే అంశం. 2009లో దక్కన్ ఛార్జర్స్ జట్టులో వీరిద్దరూ కలిసి ఆడారు. ఆ ఏడాది గిల్క్రిస్ట్ నేతృత్వంలోనే దక్కన్ ఛార్జర్స్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. దాంతో ఈ ఇద్దరి మధ్య అప్పటి నుంచి ఉన్న అనుబంధం ఈ సెల్ఫీ ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చింది.
రోహిత్ ఇన్నింగ్స్ ఆకట్టుకున్నాడు
అడిలైడ్ వన్డేలో భారత్ ఓడిపోయినప్పటికీ, రోహిత్ శర్మ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 73 పరుగులు చేసి జట్టును నిలబెట్టాడు. తొలి వన్డేలో కేవలం 8 పరుగులకే ఔటైన రోహిత్, ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చినట్లు నిరూపించాడు. రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని రోహిత్ తన ఫిట్నెస్, ఫామ్ రెండింటినీ కాపాడుకుంటున్నాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
*సోషల్ మీడియాలో రోహిత్ మాజిక్
క్రికెట్లో మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా రోహిత్ శర్మ మేజిక్ కొనసాగుతూనే ఉంది. గిల్క్రిస్ట్ లాంటి ప్రపంచ లెజెండ్ కూడా రోహిత్ ఫోటోతో తన ఫాలోవర్స్ సంఖ్య పెరగడం, “హిట్మ్యాన్ క్రేజ్” ఎంత ఉందో చాటి చెబుతోంది. ఒక్క ఫొటోతో 24 వేల ఫాలోవర్స్ పెరగడం అంటేనే అది రోహిత్ శర్మ మేజిక్ కాదా! అని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.