ఆ ప్రాజెక్టు.. కేసీఆర్ కుటుంబానికి కాసులు కురిపించింది: రేవంత్
బీఆర్ ఎస్ నేతల అవినీతిపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ప్రజలు కేసీఆర్ను ఎంపీని చేసి.. పార్లమెంటుకు పంపిస్తే.. అక్కడ కూడా.. తన స్వార్థ రాజకీయాలే చేశారని అన్నారు.
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు వెనుకేసుకుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే 26 లక్షల ఎకరాలకు నీరు వచ్చేదని.. కానీ, తమ ఇంట్లో సొమ్ములు పారించుకునేందుకు పంపులు, లిఫ్టుల పనులు చేశారని విమర్శించారు. 27 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల్లో సింహభాగం నిధులు కేసీఆర్ కుటుంబానికి చేరాయని చెప్పారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. ఇక్కడ చేపట్టిన సాటు నీటి ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్ వద్ద మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరా ల బీఆర్ ఎస్ పాలనలో జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకువస్తామని.. ఇక్కడి రైతులను మభ్యపెట్టి మోసం చేశారని విమర్శించారు.
బీఆర్ ఎస్ నేతల అవినీతిపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ప్రజలు కేసీఆర్ను ఎంపీని చేసి.. పార్లమెంటుకు పంపిస్తే.. అక్కడ కూడా.. తన స్వార్థ రాజకీయాలే చేశారని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చేసేందుకు చాలానేపనులు ఉన్నాయని..కానీ, కేసీఆర్ ఆయా పనులు వదిలేసి.. తన సొంత లాభం కోసం ఉవ్విళ్లూరూరారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గడిచిన రెండున్నరేళ్లలో 22 వేల కోట్లు కేటాయించి.. పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించామని చెప్పారు.
ఒక్క మహబూబ్నగర్కే 8 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కనీసం భూసమీకరణ అయినా చేసి ఉంటే.. పనులు ఇప్పుడు వడివడిగా సాగేవని చెప్పారు. అయితే.. బీఆర్ ఎస్ హయాంలో అది కూడా సాధ్యం కాలేదని చెప్పారు. తెచ్చిన అప్పులు ఏం చేశారో చెప్పమంటే ఎదురు దాడి చేస్తున్నారని విమర్శించారు. ``రేవంత్పై కోపంతో ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం మానేశారు`` అని వ్యాఖ్యానించారు.