ఢిల్లీ యూనివర్సిటీ ప్రోటోకాల్ ఏంటి? రాహుల్ గాంధీ పర్యటన ఎందుకు వివాదాస్పదమైంది?
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించారు.;

కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నార్త్ క్యాంపస్లోని డూసు (DUSU - Delhi University Students Union) అధ్యక్షుడి ఆఫీసులో NSUI (National Students' Union of India) విద్యార్థులతో మాట్లాడారు. అయితే, రాహుల్ గాంధీ ఈ పర్యటన ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఢిల్లీ యూనివర్సిటీ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పర్యటనలు మళ్లీ జరగకూడదంటూ హెచ్చరించింది. రాహుల్ గాంధీ ఇలా అకస్మాత్తుగా రావడం సంస్థ ప్రోటోకాల్ను ఉల్లంఘించడమేనని ఢిల్లీ యూనివర్సిటీ అంటుంది.
యూనివర్సిటీ అధికారులు మాట్లాడుతూ..ఇది సంస్థాగత ప్రోటోకాల్ను ఉల్లంఘించడమే కాకుండా, విద్యార్థులు, పరిపాలన పనులకు కూడా ఆటంకం కలిగించిందని చెప్పారు. ప్రాక్టర్ ఆఫీసు విడుదల చేసిన ప్రకటనలో రాహుల్ గాంధీ రెండోసారి ఇలాంటి పర్యటన చేశారని పేర్కొంది. ఈ పర్యటన సమయంలో డూసు ఆఫీసును భద్రతా వలయంలోకి తీసుకున్నారు. ఎవరినీ లోపలికి అనుమతించలేదు. డూసు కార్యదర్శిని కూడా తన ఆఫీస్లోకి వెళ్ళనివ్వలేదు. అంతేకాదు, కొందరు విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించారని కూడా ఆరోపణలు ఉన్నాయి.
ప్రోటోకాల్ అంటే ఏమిటి?
ఢిల్లీ యూనివర్సిటీ ప్రోటోకాల్ గురించి పబ్లిక్గా పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. అయితే, రాహుల్ గాంధీ ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపణలు వచ్చిన తీరును బట్టి చూస్తే కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి. ఎవరైనా ముఖ్య అతిథులు యూనివర్సిటీకి వస్తున్నట్లయితే ఆ వివరాలను యూనివర్సిటీకి కొన్ని రోజుల ముందుగానే తెలియజేయాలి. అంటే, ఏ తేదీన ఎవరు వస్తున్నారు, ఏ కార్యక్రమానికి వస్తున్నారు, ఎక్కడెక్కడ వెళ్తారు, ఎవరెవరిని కలుస్తారు, వారి కార్యక్రమం ఎంతసేపు ఉంటుంది వంటి వివరాలు ముందుగానే తెలియజేయాలి.
ప్రోటోకాల్ ఎందుకు పాటిస్తారు?
ఈ ప్రోటోకాల్లను పాటించడం వెనుక ముఖ్య కారణాలు ఉన్నాయి:
* అతిథి భద్రత: అతిథికి ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
* విద్యార్థుల చదువులకు ఆటంకం : అతిథులు రావడం వల్ల విద్యార్థుల చదువులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవచ్చు.
* ముందుగానే ఏర్పాట్లు: కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవచ్చు.
* గందరగోళ నివారణ: రాహుల్ గాంధీ అకస్మాత్తుగా వచ్చినప్పుడు జరిగినట్లుగా ఎలాంటి దురుసు ప్రవర్తన లేదా గందరగోళం జరగకుండా చూసుకోవచ్చు.
ఈ ప్రోటోకాల్లను పాటించడం వల్ల యూనివర్సిటీలో క్రమశిక్షణతో కూడిన వాతావరణం నెలకొంటుంది. కానీ, రాహుల్ గాంధీ పర్యటనలో ఇవన్నీ జరగకపోవడంతోనే ఈ వివాదం మొదలైంది.