రఘురామ మనసులో మాట.. విన్నారా ..!
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజు వ్యూహం మారుస్తున్నారు.;
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజు వ్యూహం మారుస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉండి నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తరచుగా ఆయన మీడియా ముందుకు వచ్చి తన వ్యక్తిగత అంశాలతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన ఒక వర్గంపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో తన మనసులోని మాటను తాజాగా ఓ మీడియా ఛానల్ కు వెల్లడించడం విశేషం.
తన పరిధి అసెంబ్లీ కాదని, తన టార్గెట్ ఎప్పుడూ పార్లమెంటు పైనే ఉంటుందని చెప్పుకొచ్చారు. తద్వారా ఆయన మనసు మరోసారి ఎంపీ ఎన్నికలపై ఉన్నట్టుగా స్పష్టమైంది. వైసిపి హయాంలో నరసాపురం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణరాజు ఆ పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. 2019 నుంచి 24 వరకు భారీ ఎత్తున జగన్ పైన వైసిపి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. నిత్యం మీడియాలో జగన్ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అది ఆయనకు కలిసి వచ్చింది.
అదేవిధంగా స్థానికంగా ఓటు బ్యాంకు కూడా పెంచిందన్న వాదన వినిపించింది. ఇక, ఇప్పుడు మళ్లీ నరసాపురం నియోజకవర్గం పైనే రఘురామ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు. తన పరిధి అసెంబ్లీ కాదని.. పార్లమెంటు అని వ్యాఖ్యానించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఆయన పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా నరసాపురం ఆయనకు కలిసి వచ్చిన నియోజకవర్గంగా కూడా వ్యాఖ్యానించడం విశేషం.
క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో గతంలో చాలా మంది క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాయకులు విజయం సాధించారు. వీరిలో రఘురామ కృష్ణంరాజు కూడా ఒకరు. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి రఘురామ పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. మరి దీనికి చంద్రబాబు ఏమంటారు.. నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది చూడాలి. ఇప్పటికైతే రఘురామ తన మనసులో మాటని చెప్పేశారు. నరసాపురం నుంచి ఆయన పోటీ ఖాయమని కూడా తెలుస్తోంది.