సోమనాథ క్షేత్రంలో మోదీ 'శౌర్యయాత్ర'.. 108 అశ్వాల కవాతు.. ఆధ్యాత్మికతతో ఉట్టిపడ్డ చారిత్రక వైభవం!
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం చారిత్రక సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించారు.;
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం చారిత్రక సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించారు. ఆధ్యాత్మికత, దేశభక్తి కలగలిసిన ఈ పర్యటనలో 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' వేడుకలు అంబరాన్నంటాయి. విదేశీ దురాక్రమణదారుల నుంచి ఆలయాన్ని రక్షించేందుకు ప్రాణత్యాగం చేసిన వీరుల స్మృత్యర్థం నిర్వహించిన ఈ కార్యక్రమం భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.
108 అశ్వాల అంగరక్షక కవచం
ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ప్రధాని మోదీ కాన్వాయ్ వెంట సాగిన అశ్వాల కవాతు. రాజరిక వైభవాన్ని తలపిస్తూ 108 అశ్వాలు ఎస్కార్ట్గా సాగుతుంటే ఆ దృశ్యం చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. గతకాలపు చారిత్రక శౌర్యాన్ని కళ్లకు కట్టినట్లుగా ఉన్న ఈ ఘట్టం సోమనాథ్ వీధుల్లో ఒక అద్భుత దృశ్యకావ్యంలా ఆవిష్కృతమైంది.
వీర యోధులకు ఘన నివాళులు
శౌర్యయాత్రలో భాగంగా ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయ రక్షణ కోసం పోరాడిన యోధులకు ఘనంగా నివాళులు అర్పించారు. భారతీయ సంస్కృతిని, ఆలయ సంపదను కాపాడే క్రమంలో ప్రాణాలర్పించిన వారి త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. "సోమనాథ్ కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు.. అది భారతీయ నిలకడకు, అజేయమైన ఆత్మగౌరవానికి చిహ్నం." అని మోడీ పేర్కొన్నారు.
సంస్కృతీ సౌరభాల నడుమ స్వాగతం
యాత్ర పొడవునా గుజరాతీ సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలు, డోలు వాయిద్యాల హోరు మార్మోగిపోయింది. వేలాదిమంది భక్తులు, స్థానికులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలతో ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని కూడా ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు.
లోక కల్యాణం కోసం ప్రత్యేక పూజలు
శౌర్యయాత్ర అనంతరం ప్రధాని సోమనాథ్ ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. అక్కడ మహాదేవుడిని దర్శించుకుని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ శ్రేయస్సు, శాంతి, ఐక్యత వర్ధిల్లాలని ఆయన ప్రార్థించారు.
చరిత్ర, ఆధ్యాత్మికత, సంస్కృతి మేళవించిన ఈ శౌర్యయాత్ర, నేటి తరానికి భారతీయ వారసత్వ గొప్పతనాన్ని చాటిచెప్పడమే కాకుండా సోమనాథ్ వైభవాన్ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.