రేపల్లె వైసీపీలో మార్పు వచ్చేస్తుందా.. !
వైసీపీ రాజకీయంగా అడుగులు ముమ్మరం చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో తాజాగా పీటా నాగ మోహన కృష్ణను ఇంచార్జ్గా నియమించారు.;
వైసీపీ రాజకీయంగా అడుగులు ముమ్మరం చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో తాజాగా పీటా నాగ మోహన కృష్ణను ఇంచార్జ్గా నియమించారు. అయితే.. ఈయన వల్ల నియోజక వర్గంలో మార్పు వస్తుందా? అనేది కీలక ప్రశ్న. వాస్తవానికి ఈ నియోజకవర్గం బలమైన టీడీపీ కంచుకోటగా ఉంది. ఈ క్రమంలో వైసీపీ తరఫున అంతే బలంగా ఇక్కడ పోరాటం చేసే నాయకులు అవసరం. కానీ, ఆ పరిస్థితి పీటాకు లేదని అంటున్నారు.
ముఖ్యంగా మంత్రి అనగాని వైసీపీ హవాలోనూ 2019లో విజయం దక్కించుకున్నారు. దీనికి ముందు కూడా ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. అలాంటి నాయకుడిని ఇక్కడ ఓడించేందుకు వైసీపీ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నా.. ఆ మేరకు వ్యూహాత్మకంగా ప్రజలకు చేరువయ్యే పరిస్థితి పీటాకు కనిపించడం లేదు. అంతేకాదు.. వైసీపీకి ఇక్కడ ఒకప్పుడు బలంగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. పోనీ.. మాజీ మంత్రి అంబటి రాంబాబు హవా అయినా ఉందా? లేదనే అంటున్నారు.
ఈ క్రమంలో రేపల్లెకు కొత్త ఇంచార్జ్గా పీటా కృష్ణ నియామకం పెద్దగా ఊపు తెచ్చేలా లేదని సొంత పార్టీలో నే నాయకులు చెబుతున్న మాట. అంతేకాదు.. ఈయన మంత్రి అనగాని ముందు తేలిపోవడం ఖాయమని కూడా అంటున్నారు. ఇదిలావుంటే.. వచ్చీ రాగానే.. పదవిని చేపట్టీ చేపట్టగానే.. పీటా వివాదాల్లో చిక్కుకుపోయారు. రప్పా-రప్పా డైలాగులు. ఫ్లెక్సీలను చింపడం వంటివిన్యాసాలతో ఆయన తొలి అడుగులోనే వివాదాస్పద నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.
అంతేకాదు.. ఎవరైనా ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. కానీ, పీటా మాత్రం తన మాటలతో రెచ్చగొట్టే రాజకీయాలకు కేంద్రంగా మారుతున్నారన్న వాదనకు బలోపేతంగా మారారు. ఇటు అనగాని తోపాటు టీడీపీకి మోపిదేవి వంటి బలమైన నాయకులు ఉన్నారు. మరి ఈ లెక్కన వైసీపీలో ఎవరు ఉన్నారన్నది ప్రశ్న. గతంలో మాజీ మంత్రి విడదల రజనీని ఈ నియోజకవర్గానికి వెళ్లమంటే.. కాదన్నారు. ఇక, అంబటి పరిస్థితి కూడా అంతే. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు పీటా ఏమేరకుపార్టని ముందుకు తీసుకువెళ్తారన్నది చూడాలి.