రిటైర్మెంట్ కు ముందు పవర్ ఫుల్ పదవి సృష్టించుకున్న పాక్ ఆర్మీ చీఫ్!

భారత దేశంలో ఉన్న విధంగానే పాక్ లోనూ మూడు దశాలను ఏకం చేస్తూ కొత్త పదవి సృష్టిస్తోంది. ఈ మేరకు రాజ్యాంగాన్ని కూడా సవరిస్తూ తాజాగా తీర్మానం కూడా పార్లమెంట్ లో ఆమోదం తీసుకుంటోంది.;

Update: 2025-11-09 04:29 GMT

పాకిస్థాన్ భారత్ మీదనే తన పగ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తూంటుంది. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని వేయి ఏళ్ళు అయినా యుద్ధం చేస్తామని ప్రకటించుకుంటూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ అన్నది పాక్ కి మింగుడు పడని విధంగా మారింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే పాక్ చతికిల పడాల్సి వచ్చింది. దానికి భారత్ వ్యూహాలు కో ఆర్డినేషన్ అన్నీ దోహదపడ్డాయి. దాంతో గత తప్పిదాలను సవరించుకుంటూ తమ బలాన్ని పెంచుకోవడానికి పాక్ కొత్త మార్గాలు అన్వేషిస్తుంది. ఇక పాక్ కి ఆర్మీ చీఫ్ గా ఉన్న ఆసిం మునీర్‌ అంటే ఎంతో గురి. ఆయనకు ఈ కీలక పదవి ఇవ్వడం వెనకనే పాక్ ఉద్దేశ్యాలు ఏమిటో బయటపడ్డాయి. ఇక ఆసిం మునీర్‌ సంగతీ ఎరుకే. ఆయన భారత్ మీద అదే పనిగా విషం చిమ్ముతూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో సిద్ధహస్తుడు. ఆయన పహల్గాం ఉగ్ర దాడి వెనక ఉన్న పధక రచయిత అన్నది కూడా అందరికీ తెలిసిందే. ఇపుడు ఆయననే పాక్ నమ్ముకుని మరింత బలోపేతం చేస్తోంది.

కొత్త పదవితో :

ఇక చూస్తే కనుక పాక్ ఆర్మీ చీఫ్ పదవి నుంచి ఆసిం మునీర్‌ ఇదే నెల 28తో పదవీ విరమణ చేయనున్నారు. దాంతో ఆయనను కొనసాగించడమే కాకుండా ఇంతకు మించిన బలంతో బలంగంతో శక్తివంతుడిగా చేస్తూ కీలక పదవిని కట్టబెట్టేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారత దేశంలో ఉన్న విధంగానే పాక్ లోనూ మూడు దశాలను ఏకం చేస్తూ కొత్త పదవి సృష్టిస్తోంది. ఈ మేరకు రాజ్యాంగాన్ని కూడా సవరిస్తూ తాజాగా తీర్మానం కూడా పార్లమెంట్ లో ఆమోదం తీసుకుంటోంది. సైన్యం, వైమానిక దళ, నౌకాదళం అన్న ఈ మూడు దళాలను ఏకం చేస్తూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్‌ అంటే సీడీఎఫ్ పోస్టుని క్రియేట్ చేస్తోంది. ఈ పదవిలో ఉన్న వారికి మొత్తం త్రివిధ దళాల మీద పూర్తి ఆధిపత్యం ఉంటుంది. ఇప్పటికే సైన్యాధ్యక్షుడిగా ఉన్న ఆసిం మునీర్‌ ని ఈ కొత్త పదవిలో కూర్చోబెట్టి తన కాగల కార్యాలను ఆయనతో నెరవేర్చుకోవాలని పాక్ పాలకులు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు.

మరింత బలవంతుడిగా :

ఇప్పటికే పాక్ మొత్తం తన చేతుల్లో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆసిం మునీర్‌ కి కొత్త పదవి కట్టబెడితే ఆయనకు మరింత అధికారం దక్కుతుంది. ఆయన మాట శాసనంగా పనిచేస్తుంది. సైన్యం మీద పట్టు పెరుగుతుంది. అలాగే అన్ని దళాల మీద ఆయన పట్టు కూడా ఉంటుంది. భవిష్యత్తు ఆలోచనలో భాగంగానే ఆసిం మునీర్‌ కి ఈ కీలక పదవి కట్టబెడుతున్నారని అంటున్నారు. ఆయన చేతిలో విశిష్టమైన అధికారాలు పెట్టడం ద్వారా పాక్ ఆలోచనలు ఏమిటి అన్నది కూడా అంతర్జాతీయ దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు భారత్ చేతిలో దారుణంగా దెబ్బ తిన్న పాక్ అయితే రగిలిపోతోంది. దాంతో కాళ్ళూ చేతులూ కూడదీసుకుని మళ్ళీ తన టార్గెట్ ని ఫిక్స్ చేసుకోవడానికే ఆసిం మునీర్‌ ని బలవంతుడిని చేస్తోంది అని అంటున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే దాయాది పట్ల ప్రత్యేకించి ఆసిం మునీర్‌ దూకుడు దుందుడుకు స్వభావం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News