సానిటరీ ప్యాడ్ రూపకర్తకి అరుదైన గుర్తింపు.. ఇన్నేళ్లకు దక్కిన గౌరవం!
భారతదేశపు 'ప్యాడ్మ్యాన్'గా నీరాజనాలు అందుకుంటున్న అరుణాచలం మురుగనంతం అరుదైన మైలురాయిని చేరుకున్నారు.;
భారతదేశపు 'ప్యాడ్మ్యాన్'గా నీరాజనాలు అందుకుంటున్న అరుణాచలం మురుగనంతం అరుదైన మైలురాయిని చేరుకున్నారు. 2026 నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరు నామినేట్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా గర్వకారణంగా మారింది. గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం, ఋతు పరిశుభ్రతపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఆయన చేసిన దశాబ్దాల పోరాటానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఒక సామాన్యుడు అసాధారణ లక్ష్యం కోసం చేసిన ప్రయాణం ఇప్పుడు ప్రపంచ శాంతికి సరికొత్త అర్థాన్ని ఇస్తోంది.
ఎవరీ అరుణాచలం మురుగనంతం?:
తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనంతం ఒక సామాన్య వ్యక్తిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందులను, ముఖ్యంగా నెలసరి సమయంలో వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను చూసి ఆయన చలించిపోయారు. అప్పట్లో శానిటరీ ప్యాడ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో, పేద మహిళలకు అందుబాటులో ఉండేలా అతి తక్కువ ఖర్చుతో ప్యాడ్లు తయారు చేసే యంత్రాన్ని ఆయన కనిపెట్టారు.
అవమానాల నుంచి నోబెల్ నామినేషన్ వరకు:
మురుగనంతం ఈ యంత్రాన్ని కనిపెట్టే క్రమంలో ఎన్నో అవమానాలను భరించారు. సొంత ఊరి వారు, చివరకు కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ఆయన వెనకడుగు వేయలేదు. తక్కువ ధరకే నాణ్యమైన ప్యాడ్లను అందించడమే కాకుండా, వేలాది మంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా నిలబెట్టారు. ఇక ఆయన జీవిత కథ ఆధారంగానే బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా 'ప్యాడ్మ్యాన్' సినిమా వచ్చి ఎంత హిట్ అయిందో తెలిసిందే.
ప్రపంచ శాంతికి కొత్త నిర్వచనం:
సాధారణంగా యుద్ధాలు లేకుండా చేయటం శాంతి అనుకుంటాం. కానీ ఆరోగ్యం, గౌరవం, మరియు లింగ వివక్ష లేని సమాజం కూడా శాంతికి పునాది అని నోబెల్ కమిటీ గుర్తించింది. ఇక మురుగనంతం చేసిన కృషి వల్ల లక్షలాది మంది బాలికలు ఆరోగ్యం పాడవకుండా స్కూళ్లకు వెళ్లగలుగుతున్నారు. అందుకే 2026 నోబెల్ శాంతి బహుమతికి ఆయన నామినేట్ అవ్వడం అనేది ప్రపంచం శాంతిని చూసే కోణంలో వచ్చిన గొప్ప మార్పుగా భావించవచ్చు.
సామాజిక విప్లవం - ప్యాడ్మ్యాన్ మార్గం:
ఒకప్పుడు నెలసరి గురించి మాట్లాడటానికే సమాజం లో సిగ్గుపడేవారు. కానీ మురుగనంతం ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆయన కనిపెట్టిన యంత్రాలు ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉపయోగపడుతున్నాయి. శానిటరీ పేదరికాన్ని పారద్రోలి, మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది. ఈ నామినేషన్ ఆయన ఇన్నేళ్ల అతని కష్టానికి దక్కిన నిజమైన గౌరవం.
అరుణాచలం మురుగనంతం ప్రయాణం మనందరికీ ఒక స్ఫూర్తి. ఒక మంచి ఆలోచన ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదిరించి సమాజంలో మార్పు తీసుకురావచ్చని ఆయన నిరూపించారు. 2026 నోబెల్ శాంతి బహుమతి ఆయనకు వరించాలని, తద్వారా భారతీయ సామాజిక పారిశ్రామికవేత్తల కీర్తి ప్రపంచవ్యాప్తం అవ్వాలని కోరుకుందాం.