యూఎస్ ఆపరేషన్... 'అర్ధరాత్రి సుత్తిదెబ్బలు' వివరించిన పెంటగాన్!
అవును... ఇరాన్ లో ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని తాము సంపూర్ణంగా నాశనం చేశామని ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.;
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇప్పుడు పశ్చిమాసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ రెండు దేశాల మధ్య వీలైనంత తొందరగా ముగిసిపోవాలని కోరుకుంటున్న వేళ.. ఇప్పుడు అగ్రరాజ్యం ఎంట్రీతో యుద్ధం మరింత విస్తరిస్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ సమయంలో.. ఈ ఆపరేషన్ గురించి పెంటగాన్ పలు విషయాలు వెల్లడించింది.
అవును... ఇరాన్ లో ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని తాము సంపూర్ణంగా నాశనం చేశామని ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దానిపై ఏకంగా ఆరు బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించామని తెలిపారు. ఇదే సమయంలో.. ఇరాన్ అణుసామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమని.. పశ్చిమాసియా దేశాలను ఇరాన్ భయపెడుతోందని.. ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత టెహ్రాన్ దే అని అన్నారు.
ఇదే సమయంలో... ఇరాన్ లో ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెహ్రాన్ శాంతిని నెలకొల్పకపోతే.. దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్, అమెరికా కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. అమెరికా రక్షణశాఖ మంత్రి హీట్ హెగ్ సేత్ ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఇందులో భాగంగా... ఇరాన్ లోని కీలక అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిపామని.. దీనికి "ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్" నామకరణం చేశామని వెల్లడించారు. ఈ ఆపరేషన్ తో ఇరాన్ లోని అణుకార్యక్రమానికి తీవ్ర విఘాతం కలిగిందని.. అయితే, ఈ దాడులు చేసినప్పటికీ తాము ఇరాన్ తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని తెలిపారు! అదేవిధంగా... అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టడం తమ దాడుల ఉద్దేశం కాదని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో.. ఇరాన్ లో ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టడం తమ దాడుల ఉద్దేశ్యం కాదని.. తాము అక్కడ పాలనా మార్పును కోరుకోవడం లేదని తెలిపారు. ఇదే సమయంలో తమ కమాండ్ ఇన్ చీఫ్ (ప్రెసిడెంట్ ట్రంప్) నుంచి వచ్చిన ఆదేశాలను పాటించామని.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీశామని తెలిపారు. మొత్తంగా 14 బంకర్ బస్టర్ బాంబులను జారవిడిచినట్లు పేర్కొన్నారు.
ఇదే సమయంలో... ఈ ఆపరేషన్ కోసం 125కి పైగా విమానాలు ఉపయోగించామని.. ఏడు స్టెల్త్ బీ-2 బాంబర్లు పాల్గొన్నాయని.. ఈ మొత్తం ఆపరేషన్ 25 నిమిషాల్లోనే పూర్తయ్యిందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ తెలిపారు. ఇందులో భాగంగా... అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 6:40 గంటలకు దాడి చేసి, 7:05 కి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
కాగా... ఇరాన్ లోని అణుస్థావరాలపై దాడుల అనంతరం స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ మిలిటరీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇది పూర్తిగా సైనిక విజయమని అన్నారు. శాంతి కావాలా.? విషాదం కావాలా.? అనేది టెహ్రాన్ నిర్ణయించుకోవాలని అన్నారు.