టీడీపీలో జోష్.. ఆ హామీ నిజం చేస్తారా!?
వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు.. అప్పటి ప్రభుత్వ విధానాలు, వైసీపీ నాయకుల అవినీతి, అక్రమా లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు.
టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపేలా రెండురోజుల కిందట మంత్రి, ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్.. కీలక ప్రకటన చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు.. టీడీపీ ఆఫీసులకు క్యూ కట్టారు. పార్టీ తరఫున మరింత ఎక్కువగా కృషి చేస్తామని.. చెబుతున్నారు. అయితే.. లోకేష్ ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కొందరు కోరుతున్నారు. దీంతో ఇప్పుడు ఆహామీపైనే మంత్రి దృష్టి పెట్టారని తెలిసింది.
ఏంటా హామీ?
వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు.. అప్పటి ప్రభుత్వ విధానాలు, వైసీపీ నాయకుల అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఈ క్రమంలో వారిపై జిల్లాల్లో వందలాది కేసులు నమోదయ్యాయి. అవన్నీ.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చాలా మంది బెయిల్ రాక.. జైళ్లలోనే ఉంటున్నారని.. ఇటీవల పార్టీ దృష్టికి వచ్చింది. దీంతో టీడీపీ లీగల్ సెల్ ద్వారా.. వారికి బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాటి కేసుల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను మోపడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
ఇక, ఇటీవల మంత్రి లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యటించినప్పుడు కార్యకర్తలు.. తమపై ఉన్న కేసుల విషయాన్ని ప్రస్తావించారు. ``మన ప్రభుత్వం వచ్చినా.. ఇంకా మేం కోర్టుల చుట్టూ తిరుగుతు న్నాం.ఆ కేసుల్లో పస లేదు. అవన్నీ రాజకీయ ప్రేరేపిత కుట్ర కేసులు`` అని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. దీంతో లోకేష్ వెంటనే స్పందించి.. వాటిని ఎత్తేయిస్తామని.. కార్యకర్తలు హుషారుగా పనిచేయాలని సూచించారు.
ఆ వెంటనే జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల ద్వారా.. కేసుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ వందలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు వీటిని ఎత్తేస్తే.. పార్టీకార్యకర్తల్లో జోష్ పెరుగుతుంద న్నది వాస్తవం. తాజాగా మంత్రి ఈ వ్యవహారంపై హోం శాఖ వర్గాలతో చర్చించారని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. న్యాయపరమైన వివాదాలు.. రాకుండా.. అన్నీ ఆలోచించి ముందుగా చిన్న పాటి కేసులను ఎత్తేసే ప్రక్రియకు అడుగులు వేస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. టీడీపీ కార్యకర్తలు హుషారుగా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతారని పార్టీ కూడా అంచనా వేస్తోంది.