మిమ్మల్ని డిస్పాయింట్ చేయను.. పుట్టపర్తిలో లోకేశ్ మార్క్ పంచ్ డైలాగులు

పుట్టపర్తి సభలో మంత్రి లోకేశ్ పంచ్ డైలాగులతో అదరగొట్టేశారు. పుట్టపర్తికి వచ్చా పంచ్ డైలాగులు వేయకుండా ఉంటానా? అంటూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ విపక్షంపై విరుచుకుపడ్డారు మంత్రి లోకేశ్.

Update: 2026-05-15 10:46 GMT

పుట్టపర్తి సభలో మంత్రి లోకేశ్ పంచ్ డైలాగులతో అదరగొట్టేశారు. పుట్టపర్తికి వచ్చా పంచ్ డైలాగులు వేయకుండా ఉంటానా? అంటూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ విపక్షంపై విరుచుకుపడ్డారు మంత్రి లోకేశ్. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రసంగించారు. కార్యకర్తలను ఉత్తేజపరిచేలా మాట్లాడిన లోకేశ్ మిమ్మల్ని డిస్పాయింట్ చేయను అంటూ తనదైన శైలిలో పంచ్ డైలాగులతో సభలో రీ సౌండ్ చేశారు.

పుట్టపర్తి వచ్చా.. పంచ్ డైలాగులు వేయకుండా ఉంటానా అంటూ మొదలుపెట్టిన మంత్రి లోకేశ్ విపక్ష వైసీపీ పేరు ఎత్తకుండా సెటైర్లు వేశారు. ‘‘వాళ్లది ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్.. మనది ఫైటర్ జెట్ బ్యాక్ గ్రౌండ్, వాళ్లది కిడ్నాప్ల బ్యాక్ గ్రౌండ్ మనది కియా బ్యాక్ గ్రౌండ్ అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. లోకేశ్ మాట్లాడుతుండగా, మహిళా అభిమానులు కేరింతలు కొట్టడం కనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కన్నా ముందుగా సభను ఉద్దేశించిన మంత్రి లోకేశ్ రాయలసీమ అభివృద్దితోపాటు ప్రధాని మోదీ సహకారంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీని ఐరన్ మ్యాన్ అంటూ అభివర్ణించారు మంత్రి లోకేశ్. ప్రధాని మోదీ నాయకత్వంలో శత్రువులకు భారత రక్షణ దళాల శక్తి ఏమిటో చూపించారని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ కు ఏడాది పూర్తి అయ్యిందని గుర్తూ చేస్తూ, ప్రతి భారతీయుడు గర్వపడే ప్రధాని దేశానికి ఉన్నారన్నారు.

ఏఎంసీఏ ప్రాజెక్టుతో సత్యసాయి జిల్లా దేశానికే రక్షణ శక్తిగా నిలుస్తుందని మంత్రి లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమికి మద్దతు ఇచ్చిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికే ఈ ప్రాజెక్టు తెచ్చామంటూ ప్రకటించారు.

కరవు నేలపై భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని, పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని గుర్తు చేశారు. గతంలో భగవాన్ శ్రీసత్యసాయి బాబా పుట్టపర్తిలో ఎయిర్ పోర్టు నిర్మిస్తుంటే అందరూ అవసరమా అని అడిగారని, కానీ తాము బాబా స్పూర్తితో పుట్టపర్తికి డిఫెన్సు ప్రాజెక్టు తెచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ ఉందని, లక్షల కోట్ల పెట్టుబడుల సాధనకు జెట్ స్పీడ్ తో పనిచేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 75 ఏళ్ల కుర్రాళ్లలా పనిచేస్తున్నారని మంత్రి లోకేశ్ ప్రశంసించారు. ఆ ముగ్గురి స్పీడ్ ఇప్పటికీ ఎవరూ అందుకోలేకపోతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఇక కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోందని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఇదే సమయంలో నమో అంటే సరికొత్త అర్థం చెప్పారు మంత్రి లోకేశ్. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీని నమో అంటూ పిలిస్తే, ఏపీలో నమో అంటే నాయుడు, మోదీ కాంబినేషన్ గా మార్చామని లోకేశ్ అన్నారు. అదేవిధంగా పుట్టపర్తిలో 5వ తరం యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి లోకేశ్ ఆసక్తికర సమాచారం వెల్లడించారు. ఈ కథ 2025 డిసెంబరులో మొదలైందంటూ తమ కృషిని ప్రజలకు వివరించారు. ఇది కేవలం డిఫెన్సు ప్రాజెక్టు మాత్రమే కాదని, రాయలసీమ భవిష్యత్తును మార్చే ప్రాజెక్టుగా అభివర్ణించారు.

Tags:    

Similar News