కన్నడ భాష వివాదం..అహంకారం సరికాదన్న ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో
టెక్నాలజీ రంగంలో ప్రముఖ పెట్టుబడిదారు, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ కన్నడ భాష వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.;

టెక్నాలజీ రంగంలో ప్రముఖ పెట్టుబడిదారు, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ కన్నడ భాష వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో పనిచేసే ఉద్యోగులు స్థానిక భాష అయిన కన్నడను నేర్చుకోవాలని, ప్రజలతో మాట్లాడేటప్పుడు దానిని ఉపయోగించాలని ఆయన సూచించారు. కన్నడ నేర్చుకోవడానికి కొందరు ఉద్యోగులు అహంకారంగా నిరాకరించడం వల్లే వివాదాలు తలెత్తుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదాలను నివారించాలంటే, కన్నడ నేర్చుకోవడం తప్పనిసరి అని ఆయన సూచన ప్రాధాన్యతను సంతరించుకుంది.
న్యూస్ ఏజెన్సీ పీటీఐ (PTI) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్దాస్ పాయ్ మాట్లాడుతూ.. "ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు బెంగళూరుకు వస్తున్నారు. స్థానికంగా కేవలం 33 శాతం మంది మాత్రమే కన్నడ మాట్లాడుతారు. బయటి నుంచి వచ్చిన వారు ఇక్కడ బాగా స్థిరపడ్డారు. కానీ కొందరు కొన్ని కన్నడ పదాలు కూడా మాట్లాడటానికి అహంకారంగా నిరాకరిస్తున్నారు. మనం కొన్ని పదాలు నేర్చుకోవాలి. వాటిని మాట్లాడటం ద్వారా స్థానికులకు గౌరవం ఇవ్వాలి. అది మన బాధ్యత" అని అన్నారు.
బెంగళూరులోని ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగికి సంబంధించిన సంఘటనపై మోహన్దాస్ పాయ్ స్పందించారు. ఒక బ్యాంక్ మేనేజర్ ఒక కస్టమర్తో కన్నడలో మాట్లాడటానికి నిరాకరించడం ప్రజల ఆగ్రహానికి కారణమైందని ఆయన గుర్తుచేశారు. చివరకు ఆ బ్యాంక్ అధికారికంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. "సార్! నాకు భాష తెలియదు.. నేను నేర్చుకుంటున్నాను.. నా సహోద్యోగి సహాయం తీసుకుంటాను" అని ఆ బ్యాంక్ మేనేజర్ గౌరవంగా బదులిచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పాయ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్ సేవలో ఉన్నవారు ఆ ప్రదేశంలోని భాషను, సంస్కృతిని గౌరవించాలని ఆయన నొక్కి చెప్పారు. కస్టమర్కు హిందీ లేదా ఇంగ్లీష్ తెలియకపోతే, ఉద్యోగులు స్థానిక భాషలో మాట్లాడగలిగేలా ఉండాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక భాషల ప్రాముఖ్యతను, పరస్పర గౌరవాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.