అమెరికా నుంచి 4,840 మంది భారతీయుల బహిస్కరణ
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారు.. వలస నిబంధనలను ఉల్లంఘించిన భారతీయులపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారు.. వలస నిబంధనలను ఉల్లంఘించిన భారతీయులపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో 2025 సంవత్సరం నుంచి ఈ ఏడాది (2026) జూలై నెల వరకు మొత్తం 4,840 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం స్వదేశానికి పంపించిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఇటీవల వెల్లడించింది.
విదేశాంగ శాఖ అధికారిక గణాంకాలు
విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం డిపోర్టేషన్ గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. 2025లో మొత్తం 3,567 మంది భారతీయులు డిపోర్ట్ అయ్యారు. 2026 జనవరి - జూలైలో మరో 1,273 మందిని అధికారులు వెనక్కి పంపారు. మొత్తం గత ఏడాదిన్నరలో 4,840 మంది భారతీయులు అమెరికా నుంచి తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.
పౌరసత్వ ధ్రువీకరణపై భారత్ స్పష్టత
ఈ పరిణామాలపై స్పందించిన విదేశాంగ శాఖ కొన్ని కీలక విషయాలను స్పష్టం చేసింది. అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి డిపోర్ట్ అయ్యే వ్యక్తుల విషయంలో నిరంతరం ఆయా ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. "ఏ వ్యక్తిని భారత్కు పంపించే ముందైనా సదరు వ్యక్తి నిజంగా భారత పౌరుడేనా కాదా అనే అంశాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తాం. పౌరసత్వాన్ని అన్ని విధాలుగా ధ్రువీకరించుకున్న తర్వాతే వారికి దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తాం." దీనివల్ల ఇతర దేశాల పౌరులను భారతీయులుగా చూపించే అవకాశాలకు లేదా తప్పుదారి పట్టించే సమాచారానికి తావు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
డిపోర్టేషన్కు ప్రధాన కారణాలు
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ చట్టాలు మరీ ముఖ్యంగా ట్రంప్ పరిపాలనలో కఠినతరం కావడంతో ఈ చర్యలు వేగవంతమయ్యాయి. డిపోర్టేషన్కు దారితీస్తున్న ముఖ్యమైన కారణాలున్నాయి. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా అక్రమ మార్గాల్లో ప్రవేశించడం... వీసా గడువు ముగిసిన తర్వాత కూడా నివసించడం.. స్థానిక వలస చట్టాలను ఉల్లంఘించడం కారణంగా చెబుతున్నారు.
అయితే డిపోర్ట్ అయిన వారందరూ తీవ్ర నేరాలకు పాల్పడిన వారని భావించకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. మెజారిటీ కేసులు వీసా నిబంధనల ఉల్లంఘన లేదా సాంకేతిక ఇమ్మిగ్రేషన్ సమస్యల వల్లే జరుగుతున్నాయని వివరించారు.
విదేశాల్లో ఉండే భారత పౌరుల హక్కులు, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చట్టపరమైన ప్రక్రియను గౌరవిస్తూ ప్రతి కేసూ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ డిపోర్టేషన్ అంశం అంతర్జాతీయ వలస విధానాలపై మళ్లీ విస్తృత చర్చకు దారితీస్తోంది.