బీఆర్ఎస్ టాక్: 'పులి' గాండ్రిస్తుందా.. సైలెంటేనా?
తెలంగాణ రాజకీయాల్లో ప్రాజెక్టుల అంశం.. గత నాలుగు రోజులుగా హీటెక్కిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమేకాదు.. సవాళ్ల వరకు వెళ్లింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రాజెక్టుల అంశం.. గత నాలుగు రోజులుగా హీటెక్కిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమేకాదు.. సవాళ్ల వరకు వెళ్లింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులను సీఎం రేవంత్ రెడ్డి.. ఆర్థిక ఉగ్రవాదులుగా పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదేసమయంలో ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వంటివారిని ఉరేసినా తప్పులేదని హరీష్రావు అంతే తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందన్న చర్చ సాగుతోంది.
ఈ వేడికి కొనసాగింపుగా.. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. అసెంబ్లీకి వచ్చి.. కాళేశ్వరం సహా తుమ్మడిహట్టిపై వివరణ ఇస్తే.. వచ్చే మూడేళ్లపాటు.. రాష్ట్రం లోని కీలక ప్రాజెక్టుల నిర్వహణను ఆయనకే అప్పగిస్తానని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ప్రకటన వెనుక.. కేటీఆర్ చేసిన సవాల్ ఉంది. మీకు చేతకాకపోతే.. మాకు అప్పగించండి.. మేం ప్రాజెక్టులు నిర్వహిస్తాం.. అని ఆయన సవాల్ రువ్వారు. అయితే..కేటీఆర్కు కాకుండా.. సీఎం రేవంత్ కేసీఆర్ను లక్ష్యంగా చేసుకున్నారు.
మరి వస్తారా?
ఈ క్రమంలో బీఆర్ ఎస్ నాయకులు.. పార్టీ శ్రేణుల మధ్య కేసీఆర్ వ్యవహారంపై ఆసక్తికర చర్చ సాగుతోం ది. ఇంత జరుగుతున్నా.. కేసీఆర్ మౌనంగా ఉండడం.. కనీసం లేఖ రాయడమో.. ఓ ప్రకటన విడుదల చేయడమో కూడా లేకుండా మౌనంగా ఉన్నారని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, మరికొందరు పులి గాండ్రిస్తుందని.. ఇప్పుడే కాదని వ్యాఖ్యానించడం గమనార్హం. కానీ, ప్రాజక్టుల విషయంలో సీఎం వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారని.. ఈ వలలో బీఆర్ ఎస్ చిక్కుకోదని మరికొందరు చెబుతున్నారు.
ఏతావాతా.. ఈ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ను టార్గెట్గా చేసుకుని రాజకీయం సాగుతున్నా.. ఆయన మాత్రం మౌనంగా ఉన్నారు. మరోవైపు ఈ నెల చివరి వారం నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగానే.. ఇరు పక్షాలు తేల్చుకుంటాయా? లేక.. కేసీఆర్ స్పందిస్తారా? బీఆర్ ఎస్ నాయకులు చెప్పుకొంటున్నట్టు పులి గాండ్రిస్తుందా? మౌనంగా ఉంటుందా? అనేది చూడాలి.