జగన్ మౌనం: 'చెక్' పెట్టకపోతే చిక్కులే.. !
మౌనం మంచిదే అయినా.. పుట్టి మునిగిపోతున్నా.. ఇంకా మౌనంగా ఉంటామంటే.. అది మొత్తానికే చేటు చేస్తుంది.;
మౌనం మంచిదే అయినా.. పుట్టి మునిగిపోతున్నా.. ఇంకా మౌనంగా ఉంటామంటే.. అది మొత్తానికే చేటు చేస్తుంది. ఈ విషయం వైసీపీ అధినేత జగన్కు తెలియంది కాదు. గత ఎన్నికలకు ముందు కూడా.. అప్పు లు.. మద్యం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి విషయాలు దుమ్మురేపాయి. దీనికితోడు వివేకానంద రెడ్డి హత్య ( బాబాయ్-గొడ్డలి నినాదం), చెల్లెళ్ల శోకాలు.. ఆస్తుల పంపకాలు.. వంటివి ముసురుకున్నాయి. వీటికి తోడు.. కీలకమైన నాయకుల నియోజకవర్గాల మార్పు వంటివి కూడా ఆయనకు వ్యక్తిగతంగా ఇబ్బందులు తెచ్చాయి.
అయినప్పటికీ.. జగన్ నోరు విప్పేందుకు ముందుకు రాలేదు. అసలు ఏం జరిగింది? అనేది ఇప్పటికీ చెప్పలేదు. ఇక, ఇప్పుడు మరోసారి అటు తల్లి, ఇటు చెల్లి.. ఇద్దరూ తగులుకున్నారు. గతంలో చెల్లి తన కు అన్యాయం చేశారని చెప్పగా.. ఇప్పుడు తల్లి విజయమ్మ తెరమీదికి వచ్చారు. తన కుమార్తె పిల్లలకు.. జగన్ అన్యాయం చేశారని.. పిల్లల నోటి దగ్గర ముద్దను కూడా లాగేసుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ తరహా వ్యాఖ్యలు వేరే వారు చేస్తే.. ప్రభావం పెద్దగా ఉండేదికాదు.
కానీ, స్వయంగా జగన్ మాతృమూర్తి బహిరంగ లేఖ రాయడంతోపాటు.. షర్మిలను వెనుకేసుకు రావడం.. అసలు ఆస్తులే పంపకాలు జరగలేదని చెప్పడం ఇప్పుడు సెంటిమెంటును మరింత పెంచేసింది. ఈ పరిణామాలకు తోడు.. పార్టీలోనూ అసంతృప్తులు మరింత పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కూడా జగన్ మౌనంగా ఉండడాన్ని ఆయనకు మద్దతుగా నిలిచే బూచేపల్లి కుటుంబం నుంచి రాచమల్లు కుటుంబం వరకు.. ఎవరూ హర్షించలేక పోతున్నారు.
ఆస్తుల విషయంలో ఏం జరిగిందో .. జగన్ చెప్పేస్తే.. ఈ వేడి తగ్గుతుందని, లేదా.. ఏమైనా ఇవ్వాల్సింది ఉంటే ఇచ్చేస్తే ఈ రగడకు ఫుల్ స్టాప్ పడిపోతుందని అంటున్నారు. లేకపోతే.. ఎన్నికల వరకు ఈ వివాదాలు ఇలానే కొనసాగితే.. మరింత డ్యామేజీ తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో రాచమల్లు ప్రసాదరెడ్డి.. పార్టీ అధినేతకు అంతర్గత లేఖ రాసినట్టు తెలిసింది. ఏం జరిగిందో చెప్పేయా లని ఆయన తెలిపినట్టు సమాచారం. మరి ఇప్పటికైనా జగన్ నోరు విప్పుతారో లేదో చూడాలి.