నాన్ స్టాప్ ఎంక్వైరీ.. సునీల్ నాయక్ విచారణ ఎంతవరకు?

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ7, బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ ఐదు రోజులుగా కొనసాగుతోంది.;

Update: 2026-03-09 10:08 GMT

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ7, బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ ఐదు రోజులుగా కొనసాగుతోంది. కోర్టు సూచనలతో ఈ నెల 5 నుంచి గుంటూరు సీసీఎస్ లో జరుగుతున్న విచారణకు సునీల్ నాయక్ రెగ్యులర్ గా హాజరవుతున్నారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా, సోమవారం ఆ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువడనుందని చెబుతున్నారు. అయితే కోర్టు తీర్పువచ్చే వరకు సునీల్ నాయక్ విచారణ కొనసాగించి, బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువడిన తర్వాత ఆయన అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం ఉత్కంఠ పుట్టిస్తోంది.

బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సునీల్ నాయక్ గత ప్రభుత్వంలో ఏపీలో డిప్యుటేషన్ పై పనిచేశారు. ఆ సమయంలో సీఐడీ డీఐజీగా పనిచేశారు. అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై దేశద్రోహం కేసు నమోదు చేయడం, ఆయనను హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరు తీసుకురావడం, ఆ రోజు సీఐడీ కస్టడీలో రఘురామపై జరిగిన దాడి జరగడం వంటి విషయాల్లో సునీల్ నాయక్ వాంగ్మూలం అత్యంత కీలకంగా చెబుతున్నారు. ప్రధానంగా సునీల్ నాయక్ సమక్షంలోనే రఘురామపై కొందరు దాడి చేసినట్లు వస్తున్న ఆరోపణలు రాజకీయంగా విస్తృత చర్చనీయాంశం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ నిందితుడు సునీల్ నాయక్ ను విచారిస్తున్నారు. ఈ రోజు కూడా విచారణ కొనసాగుతోంది. అయితే ఇంతవరకు నిందితుడు సునీల్ నాయక్ సరైన వివరాలు వెల్లడించలేదని ప్రచారం జరుగుతోంది. ఈ కారణం చూపి ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే తమ తీర్పు వచ్చేవరకు సునీల్ నాయక్ విషయంలో తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించడంతో సిట్ పోలీసులు వ్యూహాత్మకంగా విచారణ పేరుతో సునీల్ నాయక్ ను గుంటూరు సీసీఎస్ కార్యాలయానికి రప్పించుకుంటున్నారని అంటున్నారు.

నిందితుడు సీనియర్ పోలీసు అధికారి కావడం, ఆయనకు తన కేడర్ రాష్ట్రం బిహార్ లో పోలీసు వర్గాల నుంచి గట్టి మద్దతు ఉండటం వల్ల అరెస్టు చేసి తీసుకురాలేమని సిట్ పోలీసులు భావిస్తున్నారని అంటున్నారు. గతంలో సునీల్ నాయక్ అరెస్టు కోసం జరిగిన ప్రయత్నాలు, అప్పుడు పట్నా నగరంలో చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కోర్టు సూచనలే ఆయుధంగా మలుచుకుని సునీల్ నాయక్ బిహార్ వెళ్లకుండా, తమ విచారణకు రప్పించుకునేలా దర్యాప్తు అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హైకోర్టు పరిశీలనలో ఉన్న ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే వెంటనే అరెస్టు చేసేవిధంగా లేనిపక్షంలో విచారణ పేరుతో మరికొన్నాళ్లు సీసీఎస్ పోలీసు స్టేషన్ కు రప్పించేలా సిట్ పావులు కదుపుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

మొత్తానికి సునీల్ నాయక్ ఎపిసోడ్ ఇటు రాజకీయ, అటు పోలీసు వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రిటైర్డ్ ఏఎస్పీని సిఐడి అరెస్టు చేసింది. ఇదే సమయంలో సునీల్ నాయక్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో సీనియర్ ఐపీఎస్ అధికారి పీ.వీ.సునీల్ కుమార్ విచారణ తీరును తప్పుబడుతున్నారు. ఇదంతా రాజకీయ కక్షతో పెట్టిన కేసుగా ఆయన విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ విషయంలో సిట్ తీసుకోబోయే నిర్ణయం హైటెన్షన్ క్రియేట్ చేస్తోందని చెబుతున్నారు.

Tags:    

Similar News