హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఈ కొత్త స్కామ్ తో జాగ్రత్త!
అవును... ఇటీవల కాలంలో సైబర్ మోసాల బారినపడుతున్న ప్రజల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.;
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. చిన్నా పెద్దా తారతమ్యాలేమీ లేకుండా పెద్ద సంఖ్యలో అమాయక ప్రజలు ఈ మోసాల బారిన పడుతున్నారు. ఏది నిజమో, మరేది అబద్ధమో తెలుసుకునే లోపు నిండా మునిగిపోతున్నారు. ఈ క్రమంలో ఉన్న రకాలు చాలవన్నట్లుగా తాజాగా మరో కొత్త రకం సైబర్ మోసం తెరపైకి వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ జారీ చేశారు.
అవును... ఇటీవల కాలంలో సైబర్ మోసాల బారినపడుతున్న ప్రజల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా హైదరాబాద్ లో ఈ తరహా మోసాలు పెద్దగానే వెలుగుచూసిన పరిస్థితి! ఇక దేశవ్యాప్తంగా అయితే ఆ సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో కోట్ల రూపాయల ప్రజల సొమ్ము.. కన్ను మూసి తెరిచేలోపు మోసగాళ్ల బారిన పడుతుంది. ఈ సమయంలో ట్రాఫిక్ చలాన్ల పేరు చెప్పి మరో మోసం తెరపైకి వచ్చింది.
ఈ సమయంలో... ఆర్టీఏ, పోలీసుల పేరిట ట్రాఫిక్ చలానాల లింక్ లు పంపుతూ మాయగాళ్లు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది! ఇందులో భాగంగా... తాజాగా ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి మొబైల్ ఫోన్ కు సైబర్ నేరస్థులు.. 'మీ వాహనం అతివేగంతో వెళ్లడం కెమెరాలో గుర్తించామంటూ' మూడు రోజుల వ్యవధిలో రెండు సందేశాలు పంపారు.
ఆ మెసేజ్ లలో... మీ వాహనానికి సంబంధించిన చనాన్ల వివరాలు చూడాలంటే తాము పంపిన లింక్ లపై క్లిక్ చేయాలని సూచించారు. ఈ క్రమంలో... వాటిని క్లిక్ చేయగానే మన మొబైల్ ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకొని బ్యాంకు ఖాతాలో సొమ్మంతా మాయం చేస్తారని చెప్పిన డీసీపీ శిల్పవల్లి... మోసగాళ్లు పంపిన లింక్ ను క్లిక్ చేయకుండా సంచార్ సాథీలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ప్రజలు చలానా లింక్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాస్తవానికి ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన ఈ సందేశాలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు శాఖతో అనుబంధించబడిన ధృవీకరించబడిన నంబర్ల ద్వారా పంపబడతాయి. ప్రజలు ఈ తరహా నెంబర్లను గుర్తుపట్టే విషయంలో ఇప్పటికే అలవాటు పడ్డారని అంటున్నారు. అయినప్పటికీ ఈ రకమైన కొత్త సందేశాలు దాదాపు అదే తరహా నెంబర్స్ నుంచి వస్తున్నందున ప్రజలు వాటికి బలైపోయే అవకాశాలున్నాయని అంటున్నారు! అందువల్ల వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.