తమిళనాట.. కాంగ్రెస్ కు జాక్పాట్.. ఒక్కరు కాదు.. ముగ్గురు మంత్రులు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే విజయం దక్కించుకున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి భారీ జాక్ పాట్ దక్కింది.;
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే విజయం దక్కించుకున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి భారీ జాక్ పాట్ దక్కింది. ప్రస్తుతం ఏర్పాటవుతున్న విజయ్ పార్టీ టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ కీలక భాగస్వామి కానుంది. గత నెలలో జరిగిన ఎన్నికలలో విజయ్ పార్టీ కేవలం 108 స్థానాల్లో మాత్రమే విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో మేజిక్ ఫిగర్ 118 స్థానాలు చేరేందుకు చిన్న చితక పార్టీలతోపాటు.. జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో తొలి నుంచి తమ ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్ వెంటే నడుస్తారని తేల్చి చెప్పింది.
ఇలా.. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న మద్దతుకు ప్రతిఫలంగా విజయ్ పార్టీ.. తొలుత రెండు మంత్రి పదవులు ఆఫర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ.. రోజు రోజుకు విజయ్ పరిస్థితి డోలాయమానంలో పడడంతో కాంగ్రెస్ ప్రభావం.. మద్దతు కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు మూడు మంత్రి పదవులు దక్కించుకుంది. ఆదివారం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అనంతరం.. మంత్రి వర్గంతోనూ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలి జాబితాలోనే కాంగ్రెస్ పార్టీకి మూడు మంత్రి పదవులు ఇస్తున్నట్టు టీవీకే అధికారికంగా ప్రకటించింది. అంటే.. తొలిరోజు మంత్రులుగా ప్రమాణం చేసే 9 మందిలో ముగ్గురు కాంగ్రెస్ నేతలే ఉండనున్నారు.
ఒక్క మంత్రిపదవి కోసం ఐదేళ్లుగా..
నిజానికి కాంగ్రెస్ పార్టీ.. గత ఐదేళ్లు కూడా స్టాలిన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. డీఎంకే+ కాంగ్రెస్ సంయక్తంగానే 2021 ఎన్నికల్లో పోటీ చేసి విజయం దక్కించుకున్నాయి. అయితే.. డీఎంకేకు మేజిక్ ఫిగర్కు సరిపోయినంత మంది ఎమ్మెల్యేలు దక్కారు. దీంతో కాంగ్రెస్ పొత్తును కాదనకపోయినా.. ప్రభుత్వంలో మాత్రం చేర్చుకోలేదు. ఈ నేపథ్యంలో కనీసం ఒక్క మంత్రి సీటు అయినా.. తమకు ఇవ్వాలంటూ అప్పట్లో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ బ్రతిమాలింది. కానీ, స్టాలిన్ పట్టించుకోలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. కూడా ఇరు పార్టీలు కలిసే పోరాటం చేశాయి.
ఈ క్రమంలో ప్రభుత్వంలోకి వస్తే.. తమకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వాలని.. కాంగ్రెస్ పట్టుబట్టింది. ఇది కొన్నాళ్లు వివాదంగా మారింది. ఇక, ఎన్నికల ఫలితంతర్వాత.. టీవీకేకు మద్దతు కొరవడడంతో వెంటనే హస్తం పార్టీ చేతులు చాచి విజయ్కు మద్ద తు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ముగ్గురు మంత్రులను ప్రభుత్వంలో ఉంచనుంది. ఒకప్పుడు ఒక్క మంత్రి సీటు కోసం ఆరాట పడిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మూడు సీట్లను రిజర్వ్ చేసుకోవడం.. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి కోల్పోతున్న ప్రభను మళ్లీ నిలబెడుతుందన్న వాదన వినిపిస్తోంది.