మోడీ పుట్టిన రోజు.. సీఎం చంద్రబాబు ఏం చేశారంటే!
ఆయన కూడా మోడీ కోసం.. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో గురువారం ఆయన ప్రధాని సొంత నియోజకవర్గం యూపీలోని వారణాసిలో పర్యటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టిన రోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు.. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీలకు చెందిన నేతలు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమికి భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎక్కడా తగ్గలేదు. ఆయన కూడా మోడీ కోసం.. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో గురువారం ఆయన ప్రధాని సొంత నియోజకవర్గం యూపీలోని వారణాసిలో పర్యటించారు.
కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామీలతో కలిసి.. కాశీ విశ్వనాథ మందిరానికి చేరుకున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీ మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ.. ఆయన పాలన ఈ దేశానికి మరింత అవసరమని పేర్కొంటూ.. ఆ మేరకు చల్లగా చూడాలని కాంక్షిస్తూ.. విశ్వనాథుడికి భారీ అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యకంగా అన్నదానం నిర్వహించడం.. అది కూడా మోడీ పేరుపైనే కావడం గమనార్హం.
లక్ష రూపాయలను కాశీ విశ్వనాథ మందిరం అన్నదాన సేవకు సీఎం చంద్రబాబు విరాళంగా ఇచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పండితులు చంద్రబాబును ఆశీర్వదించి.. ప్రసాదాలు అదించారు. అనంతరం.. .ప్రధాని మోడీ 25 ఏళ్ల పాలనా(12 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 13 సంవత్సరాలు ప్రధాన మంత్రిగా..) ప్రస్థానంపై వారణాసిలో వాద్నగర్ సేవాయాత్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇలా.. మోడీ పట్ల చంద్రబాబు తన వినయ విధేయతలను చాటుకున్నారు.
ఇంటింటా దీపం..
మరోవైపు.. దేశవ్యాప్తంగా ఇంటింటా దీపం వెలిగించనున్నారు. ప్రధాని పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం సాయంత్రం 6-7 గంటల మధ్య ప్రతి ఇంట్లోనూ.. కుటుంబసభ్యులు ప్రధాని కోసం ప్రార్థించాలని.. ఇంటింటా దీపం వెలిగించాలని ప్రముఖులు సైతం పిలుపునిచ్చారు. వీరిలో స్టార్ షట్లర్ పీవీ సింధు, నటుడు బ్రహ్మానందం, రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ వంటివారు ఉండడం గమనార్హం.