నియోజకవర్గాల పెంపు ఖాయమే.. కానీ.. !
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పెంపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పెంపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు చేపట్టాలంటే.. 2027 వరకు వేచి వుండాలి. కానీ.. 2011 లెక్కల ప్రకారమే నియోజకవర్గాలను పెంచుతామంటూ.. కేంద్రం చేసిన ప్రకటనతో దీనిపై ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిని మెజారిటీ పార్టీలు వ్యతిరేకించాయి. ఫలితంగా ఈ వ్యవహారంపై తీసుకువచ్చిన బిల్లు వీగిపోయింది.
అయితే.. నియోజకవర్గాల పెంపుపై ఆధారపడిన.. ఆశలు పెట్టుకున్న ఏపీకి.. ఈ పరిణామం ఇబ్బందిగానే మారింది. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు మరో వ్యూహాన్ని తెరమీదికి తెచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ , తెలంగాణ నియోజకవర్గాల పెంపును ఆయన కోరుతున్నారు. దీనికి కాగాను.. రాష్ట్ర పునర్విభ జన చట్టంలో ఉన్న నిబంధనల మేరకు అమలు చేయాలని కోరుతున్నారు. లేదా.. కేంద్రం తీసుకువచ్చిన బిల్లునైనా అమలు చేయించాలని కోరుతున్నారు.
కేంద్రం తీసుకువచ్చిన బిల్లు వీగిపోయిన దరిమిలా.. ఇప్పటికిప్పుడు మళ్లీ బిల్లు ను మార్చి ప్రవేశ పెట్టినా .. పార్లమెంటులో అది ఏమేరకు ఆమోదం పొందుతున్నది ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో పునర్విభజన ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాలకు పెంచాల్సిన నియోజకవర్గాలను పెంచే దిశగా ఆలోచన చేయాలని స్పష్టం చేస్తున్నారు. దీనిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే.. కేంద్రం దేశవ్యాప్తంగా మొత్తం పెంచేదిశగా ఆలోచన చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఒకవేళ దేశవ్యాప్తంగా అమలు కాకున్నా.. ఏపీ, తెలంగాణ వరకు అయినా.. నియోజకవర్గాల పెంపును చేపట్టాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. తద్వారా ఏపీలో 50 వరకు నియోజకవర్గాలు పెరుగుతాయి. దీంతో ఆశావహులకు.. అవకాశం పెంచే ఛాన్స్ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. కానీ.. మరోవైపు దేశంలోని విపక్షాలను నియోజకవర్గాల పెంపుపై అంగీకరించేలా చేసే బాధ్యతను చంద్రబాబుకే కేంద్రం అప్పగించనుంది. దీంతో ఏం జరుగుతుందన్నది చూడాలి.